ఎర్రబెల్లితో ఢీ, రేవంత్ రెడ్డి ఒంటరి అయ్యారా?: ఎల్ రమణ అప్సెట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిల మధ్య గొడవ పైన తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. వారి తీరుతో ఎల్ రమణ నొచ్చుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లిందని సమాచారం.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా... తెలంగాణ టిడిపిలో రేవంత్, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. టిడిపిలో రేవంత్ రెడ్డి ఒంటరివాడైనట్లుగా కనిపిస్తోంది. ఎర్రబెల్లి సహా సీనియర్లంతా ఆయనపై గుర్రుమంటున్నారని తెలుస్తోంది.
చాలా రోజులుగా రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు అసహనంతో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. శనివారం జరిగిన ఓ భేటీలో వారు విరుచుకుపడ్డారు. ఒక దశలో అందరూ ఒక్కటై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
శనివారం వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ... వరంగల్ లోకసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ పెట్టాలని ప్రతిపాదించారు.
క్షేత్రస్థాయిలో అధికార టీఆర్ఎస్పై వ్యతిరేకత ఉందని, టీడీపీ పోటీపడితేనే మంచిదనీ చెప్పారు. మధ్యలో జోక్యం చేసుకున్న ఎర్రబెల్లి.. రేవంత్ ప్రతిపాదనను వ్యతిరేకించారని తెలుస్తోంది. మిత్రధర్మం ముఖ్యమని, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకే ఛాన్సిచ్చామని, ఇప్పుడూ ఇవ్వకతప్పదని, అన్నీ ఆలోచించి మాట్లాడాలని బదులిచ్చారు.
ఈ దశలో కోపం తెచ్చుకున్న రేవంత్ రెడ్డి అంటే అన్నీ మీరేనా? చివరకు పార్టీ క్యాడర్కు పంపించే ఎస్సెమ్మెస్లు కూడా నీ పేరు, రమణ పేరుతోనే వెళ్తున్నాయని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ను అని, తన పేరు అక్కర్లేదా? చివరకు టీడీఎల్పీలో కూడా తన మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
నువ్వేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నవో, చీకట్లో ఎవరిని కలుస్తున్నావో తనకు తెలియదా అని ఎర్రబెల్లిని నిలదీశారు. దీంతో సమావేశం రసాబాసగా మారింది. ఎర్రబెల్లి కోపంతో రేవంత్ను ఉద్దేశించి చీకట్లో కలిసేదేముంది? నేను ఎప్పుడూ కలుస్తానని, ఇప్పుడూ కలుస్తానని చెప్పారని తెలుస్తోంది.
నాకు తెలియకుండా సమావేశాలు పెడుతున్నారని, నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఎల్ రమణను కూడా రేవంత్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎర్రబెల్లి మళ్లీ కల్పించుకొని.. ఐనా నువ్వు పార్టీలో ఓ ఐటెం సాంగ్ గర్ల్గా మారిపోయావని, ఇలా వచ్చి అలా వెళ్తుంటావని, నీతో పార్టీకి ఒరిగిందేం లేదని వ్యాఖ్యానించారు.
ఓటుకు నోటు కేసుతో ఇప్పటికే పరువు పోయిందంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నీలా నేను కోవర్టును కాదని రేవంత్ రెడ్డి ధీటుగా స్పందించారు. ఈ దశలో మరికొందరు సీనియర్లు నేత జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించే ప్రయత్నం చేశారు. ఎర్రబెల్లికి మరికొందరు నేతలు మద్దతుగా నిలిచారని, దీంతో, రేవంత్ ఒంటరి వాడయ్యాడని తెలుస్తోంది.