'తెలంగాణ మాల్దీవులు' చూసొద్దామా..? హైదరాబాద్ నుంచి తక్కువ దూరంలోనే..
స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయి. మరో రెండు రోజుల్లో కాలేజీలకు కూడా హాలీడేస్ రానున్నాయి. మరోవైపు గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని నదులు, సరస్సులు నిండిపోయాయి. జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. తాజాగా లక్నవరం సరస్సులో జలకళ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ సరస్సుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందాలను తనివితీరా ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు.. వీటిని చూస్తే మనం కోనసీమ, అరకు, కేరళ ప్రాంతాల్లో ఉన్నామా అనిపిస్తుంది. వరంగల్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ప్రస్తుతం పర్యాటకులకు స్వర్గధామంగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు ఉంది. జోరు వానలతో సరస్సులోకి భారీగా వరద నీరు వస్తోంది. ఈ సరస్సును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఇక వీకెండ్స్ లో అయితే హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా లక్నవరం చేరుకొని సరస్సు అందాలను తిలకిస్తున్నారు. సరస్సులో సరదాగా బోటింగ్ చేసి ఆనందంగా గడుపుతున్నారు.
చుట్టూ కొండ కోనలు, చెట్లు, నీళ్లు, హరిత రిసార్ట్స్, ఇతర సదుపాయాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలో ఉన్న ఈ అందమైన సరస్సును 13వ శతాబ్దంలో కాకతీయ రాజైన గణపతి రుద్రదేవుడు నిర్మించాడు. ఈ సరస్సులో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్య జలాశయంలోని బోటుల్లో విహరిస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే లక్నవరం ఐలాండ్ కూడా ఉంది. ఇక్కడ పర్యాటకుల ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యాననవనాలు ఉన్నాయి. మొత్తం 22 కాటేజీలు ఉన్నాయి. మాల్దీవులు, సిమ్లా, మున్నార్.. ప్రాంతాలను తలపించే విధంగా ఈ ద్వీపాన్ని నిర్మించారు. ఇక హైదరాబాద్ నుంచి ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం జలాశయానికి 219 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపు 4 గంటల్లో చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications