హుస్నాబాద్లో ఉద్రిక్తత: గౌరవెల్లి భూనిర్వాసితుల నిరసన, ప్రజాప్రతినిధుల దాడులు
సిద్దిపేట: గౌరవెల్లి భూనిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ చేపట్టిన హుస్నాబాద్ బంద్... మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్కు తమ గోడు పట్టడంలేదంటూ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు భూ నిర్వాసితులు.
ఈ క్రమంలో క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, భూనిర్వాహితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలపై భూనిర్వాసితులు దాడికి యత్నించారు. కర్రలు, పైపులతో టీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడి చేశారు.
ఘర్షణలో కొందరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు యత్నించిన హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్ఐ శ్రీధర్కు కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి నిర్వాసితులను పోలీసులు చెదరగొట్టారు.
ఈరోజు హుస్నాబాద్ లో గౌరవెళ్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు పోలీసుల చేతిలో గాయపడ్డారు... వారికి సానుభూతి తెలిపి,విచారం వ్యక్తం చేసిన మంథని నియోజకవర్గ కాంగ్రెస్ mla శ్రీధర్ బాబు గారు... హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రామన్న #Husnabad @OffDSB pic.twitter.com/k5SOYvi6ck
— Vishwateja official 🇮🇳 (@Vishwatejakoona) June 14, 2022
అనంతరం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గుడాటిపల్లి నిర్వాసితులు పోలీసుస్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయమంటే తమపైనే దాడులు చేస్తున్నారని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం.. మాటలకే పరిమితమవుతోందని మండిపడుతున్నారు. కాగా, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
గౌరవెల్లి భూ నిర్వాసితులపై దాడులా: బాధితులను పరామర్శించిన బండి సంజయ్
గౌరవెల్లి భూ నిర్వాసితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్లో మాట్లాడారు.
గౌరవెల్లి భూ నిర్వాసితులపై సీఎం కేసీఆర్ కర్కశంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వారిని ఒప్పించి మెప్పించాలి కానీ.. రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయించడం, విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని నిలదీశారు. టీఆర్ఎస్, పోలీసులు కలిసి భూ నిర్వాసితులపై దాడి చేయడాన్ని బీజేపీ ఖండిస్తుందని సంజయ్ అన్నారు. ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. కాగా, బీజేపీ బృందం గౌరవెల్లి వెళ్లి, బాధితులను పరామర్శిస్తుందని తెలిపారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని బండి సంజయ్ తెలిపారు. కాగా, బండి సంజయ్ కూడా హుస్నాబాద్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం.