అతడో బీకాం గ్రాడ్యుయేట్.. ల్యాప్ టాప్ లు మాయం చేస్తూ జల్సాలు!
హైదరాబాద్/మాదాపూర్ : ఈజీ మనీకి అలవాటుపడి నగరంలోని పలు బాయ్స్ హాస్టల్స్ లో ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు చోరి చేస్తోన్న ఓ దొంగను పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పరిధిలోని కొత్తగూడ జంక్షన్ వద్ద మంగళవారం నాడు అనుమానస్పదంగా తిరుగుతుండడంతో.. పోలీసులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడడంతో అతన్ని అరెస్టు చేసి పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఏసీపీ రమణ వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన డి.వెంకటేశ్వర్లు 2006 సంవత్సరంలో నగరానికి వచ్చి నారాయణగూడలో బీకాం చదువు పూర్తి చేశాడు. అదే సమయంలో జల్సాలకు అలవాటుపడ్డాడు. రాత్రిపూట బాయ్స్ హాస్టల్ ను టార్గెట్ చేసుకుని, అంతా నిద్రపోయాక ల్యాప్ టాప్ లు సెల్ ఫోన్లు తస్కరించేవాడు.
ఈ క్రమంలో 2016లో జైలు కూడా వెళ్లిన వెంకటేశ్వర్లు నెలరోజుల తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చినా అతగాడి ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ తన పని తీరునే కొనసాగించడం మొదలుపెట్టాడు. తన స్వగ్రామం నుంచి ఉదయం పూట రైల్లో హైదరాబాద్ చేరుకోవడం.. నగరానికి వచ్చాక స్నేహితుడి వద్ద బైక్ తీసుకుని రాత్రంతా దొంగతనాల్లో మునిగిపోవడం.. పని అయిపోగానే మళ్లీ స్వగ్రామానికి చెక్కేయడం ఇతగాడి దినచర్యగా మారింది.

వెంకటేశ్వర్లు చేసిన ల్యాప్ టాప్ దొంగతనాలతో చాలామంది బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వెంకటేశ్వర్లు గురించి వెతకడం మొదలుపెట్టారు పోలీసులు. అలా.. సోమవారం నాడు కొత్తగూడ జంక్షన్ వద్ద అనుమానస్పదంగా తచ్చాడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మాదాపూర్, రాయదుర్గం, కూకట్ పల్లి, ఎస్ ఆర్ నగర్, తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఇప్పటిదాకా 20 ల్యాప్ టాప్ లు దొంగిలించినట్టుగా ఏసీపీ వెల్లడించారు.
స్నేహితుడిపై దాడి చేసి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు :
నగరంలో చోటు చేసుకున్న మరో చోరి ఘటనలో తెలిసిన స్నేహితులే ఓ వ్యక్తి వద్ద నుంచి లక్ష రూపాయల నగదును కాజేశారు. అయితే ఎట్టకేలకు ఎల్బీ నగర్ పోలీసులు ఆ నిందితులను పట్టుకుని చోరి చేసిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

ఘటన వివరాలను పరిశీలిస్తే.. పానుగంటి శివరంజన్ కుమార్ అనే వ్యక్తి కూకట్ పల్లి ఎల్లమ్మబండలోని పీజేఆర్ కాలనీలో నివాసముంటూ ఎంజీబీటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కాగా, తన ఆర్థిక అవసరాల నిమిత్తం జయప్రకాశ్ స్నేహితుడి ద్వారా ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి నుంచి ఈ నెల 26వ తేదీన లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు శివరంజన్.
అనంతరం విషయాన్ని న్యూ మలక్ పేటలో నివాసముంటోన్న అస్లాం మహమ్మద్ అనే స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఓసారి తనను కలవాలని శివరంజన్ కు సూచించాడు అస్లాం. స్నేహితుడే కదా అని నమ్మి అతని వద్దకు వెళ్లాడు శివరంజన్. తీరా అక్కడికి వెళ్లాక ముందే వేసుకున్న పథకం ప్రకారం మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శివరంజన్ పై దాడిచేసి లక్ష రూపాయాలను ఎత్తుకెళ్లిపోయారు.
అనంతరం ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించి శివరంజన్ ఫిర్యాదు చేయడంతో.. నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. సాజిద్ అలీ, గులాం నయీం, మహమ్మద్ సద్దాం హుస్సేన్, బోజు సంతోష్ కుమార్ అలియాస్ బంటి పొట్టబత్తిని శశాంక్ లను పోలీసులు అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications