చివరి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమే : 27న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాయి. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు తొలి, రెండో దశల్లో ఈ నెల 6, 10 తేదీల్లో పోలింగ్ జరిగాయి. ఇవాళ చివరి విడత పోలింగ్ జరిగింది. 9 వేల 494 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. సాయంత్రం 5 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.
మొత్తానికి ప్రశాంతమే ..
చివరి విడతలో ఇవాళ 160 జడ్పీటీసీ, 1710 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో వాయిదా పడ్డా రెండు చోట్ల కూడా ఈ దశలో పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కుమ్రంభీం, భద్రాద్రి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలక సంబంధించి ఆయా జిల్లాల్లో ఈ నెల 27న లెక్కించి, అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నెల 23 లోక్ సభ ఎన్నికల ఫలితాల లెక్కింపు తర్వాత స్థానిక సంస్థల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.

చెదురుమదురు ఘటనలు
ఇవాళ కొన్నిచోట్ల ఓటింగ్ ను బహిష్కరించగా .. మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాల్లో తారుమారయ్యాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం బద్దేపల్లిలో బ్యాలెట్పత్రం తారుమారైంది. బద్దెపల్లి ఎంపీటీసీ స్థానంలో రాపెల్లి అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో బద్దెపల్లిలో పోలింగ్ నిలిపివేశారు. ఇటు వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం భిక్కారెడ్డిగూడెంలో అభివృద్ధి జరగలేదంటూ గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లపల్లి, చెరువుముందు తండావాసులు తమ తండాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని నిరసిస్తూ పోలింగ్ను బహిష్కరించారు. రెండు తండాలకు దూరంగా మరో గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications