కర్ణాటక ఫలితాలు బాబు, కేసీఆర్లకు చెంప పెట్టు: కళ్లు తెరవాలన్న లక్ష్మణ్
హైదరాబాద్: కర్ణాటక ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి మద్దతు తెలిపారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఒక వైపు బీజేపీ గెలుపునకు మోడీ విధానాలు అభివృద్ధి పథకాలు తోడ్పాటునందిస్తే.. మరో వైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంస్థాగత బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఉత్సాహపరిచి విజయాన్ని అందించారని అన్నారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు: ఎప్పటికప్పుడు... మరిన్ని వివరాల ఇక్కడ చూడండి
మోడీ, అమిత్ షాతోపాటు కర్ణాటక సీఎం అభ్యర్థి యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని లక్ష్మణ్ అన్నారు. బీజేపీకి దక్షిణ భారత్లో ప్రాభవం లేదంటున్న వారికి ఇకపై కళ్లు తెరచుకుంటున్నాయని అన్నారు.
భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ ఇచ్చిన తీర్పు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్లకు చెంపపెట్టులాంటిదని లక్ష్మణ్ అన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో బీజేపీని ఓడించాలని ప్రయత్నించారని అన్నారు. జేడీఎస్కే కేసీఆర్ మద్దతు తెలిపారని, కాంగ్రెస్కి అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించారని వ్యాఖ్యానించారు.