చంద్రబాబు,రేవంత్ రెడ్డిలతో ప్రాణహాని... హెచ్ఆర్సీని ఆశ్రయించిన ఓటుకు నోటు నిందితుడు...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC)ను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేశారు.
ఓటుకు నోటు కేసులో అప్రూవర్గా మారినందునా...తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని మత్తయ్య ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డిలే అని మరోసారి వెల్లడించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్నందునా... కేసు పూర్తయ్యేంతవరకు తనకు రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాదు,రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగు చూసింది. టీడీపీ తరుపున వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు... నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను ఎంపీ రేవంత్ రెడ్డి ప్రలోభాలకు గురిచేశాడన్న అభియోగాలు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి రూ.50లక్షలు స్టీఫెన్ సన్కు ఇస్తూ పట్టుబడ్డ వీడియోలు కలకలం రేపాయి. స్టీఫెన్ సన్తో చంద్రబాబు సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు కూడా లీకయ్యాయి.ఈ కేసులో రేవంత్ రెడ్డి ఉదయ్ సిన్హా, సెబాస్టియన్,మత్తయ్యల,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఇదే కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
రెండు రోజుల క్రితం ఏసీబీ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణకు సండ్ర వెంకట వీరయ్య,రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ నెల 15న తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. హాజరు మినహాయింపు పిటిషన్లకు అనుమతినివ్వమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications