మందుబాబులకు చుక్కలే.. అనూహ్య షాకిచ్చిన కేసీఆర్.. నిరుద్యోగంపై కూడా కుండబద్దలు..
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మద్యం,నిరుద్యోగం,విద్యుత్ చార్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ లోటు భర్తీకి సంక్షేమ పథకాల నిధుల్లో నుంచే కోత పెడుతారా.. అని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్న వేళ.. ప్రభుత్వ వైఖరిని సీఎం కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అవసరమైతే మద్యం ధరలు పెంచుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు మందుబాబులకు గట్టి షాకిచ్చాయనే చెప్పాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరల పెంపు.. మద్య నియంత్రణతో అక్కడి మందుబాబులు గుడ్లు తేలేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహా విధానాన్ని అవలంభిస్తే.. ఇక్కడ కూడా మందుబాబుల జేబులకు భారీ చిల్లులు తప్పవు.
ప్రజలను మద్యానికి దూరం చేయడంలో భాగంగా ధరల పెంపు ఉపయోగపడుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మద్య నిషేధం సాధ్యపడదని చెబుతూ.. అందుకు గత పాలకుల ఉదాహరణలు సభ ముందు ఉంచారు. గతంలో బ్రహ్మానందరెడ్డి,విజయభాస్కర్ రెడ్డి,ఎన్టీఆర్ వంటి నేతలు మద్య నిషేధం తెచ్చినప్పటికీ.. అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని చెప్పారు. కాబట్టి మద్యం ధరలు పెంచడం ద్వారా దానిపై నియంత్రణ తీసుకొస్తామని చెప్పారు. ఇదే క్రమంలో గతంలోనూ మద్యం ధరలు పెంచామని.. రాబోయే రోజుల్లో కూడా మద్యం ధరలు పెంచేందుకు అవకాశం ఉందని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో అసలు మద్యం దుకాణాలే లేనట్టు.. అంతా పవిత్రం అయినట్టు మాట్లాడుతున్నారని.. ఆ ధోరణి సరికాదని మండిపడ్డారు.

ఇక ఆర్టీసీ చార్జీలు,విద్యుత్ చార్జీల విషయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం రొటీన్ అయిపోయిందని.. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాటి ధరల పెంచడం సాధారణమేనని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దేశంలోనే నాణ్యమైన విద్యుత్ను రాష్ట్రంలో 24గంటల పాటు సప్లై చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దీన్ని ఇలాగే కొనసాగించాలంటే కాస్త చార్జీలు పెంచక తప్పదని అన్నారు.
Recommended Video
అలాగే నిరుద్యోగం విషయంలోనూ ప్రతిపక్షాలు,రాజకీయ పార్టీలు ఇంకా యువతను మోసం చేయడం మానుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్లలో తెలంగాణలోని కోటి 20లక్షల కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలకు గత పాలకులు ఉద్యోగాలు ఇప్పించారని ప్రశ్నించారు. తిప్పి కొడితే.. ప్రభుత్వ సెక్టార్లో అంతా కలిపి 3లక్షల ఉద్యోగాలు ఉంటాయని.. ఎంతమందికి వాటిని ఇవ్వగలుగుతామని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఇచ్చామని.. అంతకన్నా ఎక్కువే ఇచ్చామని చెప్పారు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని.. అబద్దమే చెబితే సభలో ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతానని అన్నారు.












Click it and Unblock the Notifications