తెరాసని అడ్డుకున్నారు, సీఎంతో అమీతుమీకి టీటీడీపీ
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎన్నికల సందర్భంగా పికెట్ ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ జిల్లాల నుంచి కొంతమంది ఇక్కడకు వచ్చి డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో స్థానిక టీడీపీ నేతలు, బస్తీ ప్రజలు వారిని అడ్డుకున్నారు.
టీఆర్ఎస్ నేతలను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్, టీడీపీ, బస్తీవాసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పలువురు స్థానికులు టీఆర్ఎస్కు చెందిన ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.
టీటీడీపీ భేటీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ టీడీపీ అమీతుమీకి సిద్ధమైంది. ఇటీవల కేసీఆర్ నిర్ణయించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు నివాసంలో భేటీ అయిన నేతలు పలు అంశాలపై చర్చిస్తున్నారు.
పార్లమెంటరీ సెక్రటరీల నియామకం రాజ్యంగ విరుద్ధమని అభిప్రాయపడుతున్న నేతలు ఇదే అంశంపై వివిధ రాష్ర్టాల కోర్టుల తీర్పులను పరిశీలిస్తున్నారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా విషయంపైనా కోర్టుకు వెళ్లాలని నేతలు యోచిస్తున్నారు.