హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు ఒంటి గంటవరకు పొడిగింపు: బ్యాంకు వేళలు కూడా
హైదరాబాద్ : తెలంగాణలో మరో పది రోజులపాటు లాక్డౌన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, లాక్డౌన్ పొడిగించడంతోపాటు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్న సడలింపులను మధ్యాహ్నం ఒంటి గంటవరకు పొడిగించారు. దీంతో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు కూడా ఇందుకు అనుగుణంగా తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి.
జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపట్నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు ఒంటి గంటకు బయల్దేరి 2 గంటల వరకు చివరి స్టేషన్కు చేరుకోనుంది.
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అన్ని రకాల ప్రజా రవాణాకు మరో గంట అదనంగా వెసులుబాటు కల్పించారు.
బ్యాంకుల కొత్త పనివేళలు
తాజా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై బ్యాంకుల పని వేళలపై సమీక్షించింది. లాక్డౌన్ సమయం సడలింపుతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. మారిన బ్యాంకు వేళలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్గదర్శకాలు జూన్ 9 వరకు అమల్లో ఉండనున్నాయి.