వోల్వో బస్సు, లారీ ఢీ... రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
హైదరాబాద్: కట్టంగూర్ వద్ద శుక్రవారం ఉదయం వోల్వో బస్సు, లారీ ఢీ కొన్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు గాయపడ్డాడు.
తెల్లవారుజామున మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రహదారి కనిపించక పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైస్ మిల్లులో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రైస్ మిల్లు సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహ ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో మిల్లులోని ధాన్యం, బ్యాగులు మంటల్లో తగలబడ్డాయి. సుమారు రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.