హెచ్చరిక: బంగాళాఖాతంలో అల్పపీడనం... పొంచివున్న తుపాను ముప్పు
చలికి గజగజలాడుతున్న తెలంగాణకు భారత వాతావరణ కేంద్రం మరో బ్యాడ్ న్యూస్ ను వినిపించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. 23వ తేదీ నుంచి మూడు లేదా నాలుగు రోజులకు శ్రీలంకకు ఉత్తర దిశగా పయనిస్తుందని అంచనా వేస్తుంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ప్రకాశం, నెల్లూరుతోపాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు
తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలి తీవ్రత పెరిగింది. సూర్యుడు కనపడటం గగనమే అవుతోంది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పడిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి వర్షాలు కురిసే అవకాశం లేకపోయినప్పటికీ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే చలి పెరగనుంది. తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం ఈ గాలులను తనవైపు లాగేసుకుంటోంది. అదే క్రమంలో బంగాళాఖాతం నుంచి గాలి వేగం పెరుగుతోంది.

హైదరాబాద్ శివారులో 18 శాతం
తెలంగాణలో సోమవారం 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవనుంది. చల్లటి గాలుల వల్ల ఎండ వేడిమి తెలియదు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 16 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. అలాగే తేమ శాతం 40 కంటే తక్కువగా ఉంటోంది. కుటుంబంలో చిన్నపిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.
వెచ్చదనం కోసం ఉన్ని దుస్తులు ధరించాలని, వేడివేడి ఆహారం తీసుకోవాలని, అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని చెబుతున్నారు. ఉదయం సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంటుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, హెడ్ లైట్స్ వాడాలని, అలాగే ఆ సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని, కాస్తంత ఎండ వచ్చిన తర్వాత అయితే భద్రంగా ఉంటుందని తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications