మిత్ర రోబో: మోడీ-ఇవాంకా కన్ఫ్యూజ్ అయ్యారు, చప్పట్లు కొట్టిన ప్రధాని
హెచ్ఐసీసీలోని గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్ సందర్భంగా మిత్ర రోబోను స్విచ్చాన్ చేసే సమయంలో కొంత గందరగోళం ఏర్పడింది.
Recommended Video
హైదరాబాద్: హెచ్ఐసీసీలోని గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్ సందర్భంగా మిత్ర రోబోను స్విచ్చాన్ చేసే సమయంలో కొంత గందరగోళం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రూపొందించిన ఈ స్వదేశీ రోబోను ప్రధాని మోడీ, ఇవాంకా ఇద్దరూ ప్రారంభించారు.
హైదరాబాద్ బిర్యానీని మరిపిస్తారేమో: వేదికపై కేటీఆర్, ఇవాంకా ఉద్వేగం
రోబో స్క్రీన్పై భారత్ - అమెరికా గుర్తులను ఏర్పాటు చేశారు. తొలుత ప్రధాని, ఆ తర్వాత ఇవాంకా ఆ స్విచ్ను నొక్కాల్సి ఉంది. కానీ ఇద్దరు ఒకేసారి ఆన్ చేశారు. వెంటనే వెల్కమ్ ప్రైమినిస్టర్ అని రోబో అనడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
అందర్నీ ఆకట్టుకున్న ఇవాంకా
తొలిసారి మన దేశానికి వచ్చిన ఇవాంకా.. తన ఆహార్యం, ప్రసంగం, సభికుల స్పందనకు ప్రతిస్పందించిన తీరు అన్నింటిలోనూ సూపర్ అనిపించుకున్నారు. ఉత్సాహంగా మాట్లాడుతూ వేదిక అన్ని వైపులా ఉన్న ప్రతినిధులతో నేరుగా సంభాషిస్తున్నట్లు హావభావాలతో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.
మోడీతో చప్పట్లు కొట్టించుకున్న ఇవాంకా
ఇవాంకా 23 నిముషాలపాటు ప్రసంగించారు. భారతదేశ గొప్పదనాన్ని, ఇక్కడి ఆవిష్కరణలను ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ సభికులు కరతాళ ధ్వనులు చేశారు. ఆమె కూడా ప్రతిస్పందించి చప్పట్లు కొట్టి వారి మనసు గెలిచారు. ప్రధానమంత్రి మోడీ డైనమిజంలో భారతదేశం ముందుకు సాగుతోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు మోడీ సైతం నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు మంచి స్పందన
చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్ ఎంతో మంది సాంకేతిక నిపుణులను తయారుచేసిందని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇక్కడే చదువుకున్నారని ఇవాంకా ప్రస్తావించారు. ఇలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్న వారి నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ బిర్యాని గురించి మాట్లాడినప్పుడు కూడా మంచి స్పందన కనిపించింది.
ఇవాంకా ట్రంప్
మహిళలు పనిచేస్తే ఆ సానుకూల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, ఇతర మహిళల్ని ఉద్యోగాల్లో చేర్చుకోవడం, ప్రోత్సహించడం, నెట్వర్క్లు కల్పించడంలో పురుషులకంటే మహిళలే ముందుంటారని, అలాగే తమ సంపాదనను కుటుంబాలు, ఇతర వ్యవస్థల్లో తిరిగి పెట్టుబడులుగా పెట్టడంలో మహిళలదే పైచేయి అని ఇవాంకా చెప్పారు.