మహేష్ బాబుకు జీఎస్టీ జలక్: సేవా పన్ను ఎగవేయడంతో బ్యాంక్ అకౌంట్లు అటాచ్
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ జలక్ ఇచ్చింది. 2007-08 సంవత్సరానికి గానూ మహేష్ బాబు సేవా పన్ను కట్టనందున ఆయన బ్యాంక్ అకౌంట్లు అటాచ్ చేస్తున్నట్లు జీఎస్టీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమయంలో మహేష్ బాబు పలు సంస్థలను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారని ప్రకటనలో గుర్తు చేశారు అధికారులు. దీనిపై వచ్చిన ఆదాయంపై మహేష్ బాబు సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరానికి పన్ను కట్టకుండా ఉన్న మొత్తం రూ. 18.5 లక్షలుగా జీఎస్టీ అధికారులు తేల్చారు.
మహేష్ బాబు 2007-08 సంవత్సరానికి మొత్తం రూ. 18.5 లక్షల సేవా పన్ను కట్టనందున గురువారం రోజున మహేష్ బాబుకు చెందిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా, యాక్సిస్ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేశారు. దీని విలువ మొత్తం రూ. 73.5 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఇందులో జరిమానా పన్నుపై వడ్డీ కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు.
మహేష్ బాబు దీనిపై ఇంకా స్పందించలేదు. జీఎస్టీ అధికారులు అటాచ్ చేయడంతో ఈ రాజకుమారుడు వడ్డీ, జరిమానా అన్నీ చెల్లించాల్సి ఉంటుంది. 2005లో మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్లో నటించడం ప్రారంభించారు. అయితే అందులో 2007-08కి మాత్రం సేవా పన్నులు కట్టడం లేదని ఈ నోటీసుల ద్వారా తెలుస్తోంది. గతంలో నాన్నకు ప్రేమతో విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా పన్నులు ఎగవేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.