బీఆర్ఎస్లో చేరిన మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రీధర్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అన్యాయానికి గురైన నందికంటి శ్రీధర్కు బీఆర్ఎస్ పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీకి ఒక అజెండా అంటూ ఏదీ లేదన్నారు. పదేళ్లు రాష్ట్రం కోసం నిరంతరం పనిచేశామన్నారు కేటీఆర్.

పదేళ్లలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని ప్రజలను కోరారు కేటీఆర్. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరింత పనిచేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, పార్టీ నేతలకు కేసీఆర్ మాత్రమే హైకమాండ్.. ఢిల్లీలో బాసులెవరూ బీఆర్ఎస్కు లేరని కేటీఆర్ అన్నారు.

అనంతరం నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్థమై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి గులాబీ జెండా ఎగురవేస్తామని నందికంటి శ్రీధర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
— BRS Party (@BRSparty) October 4, 2023
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మేడ్చల్ - మల్కాజిగిరి డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్
నందికంటి శ్రీధర్ వెంట భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు… pic.twitter.com/mZd0z2J4ZT
కాగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు బరిలోకి దిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications