కళాశాల బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థిని మృతి (ఫోటోలు)
హైదరాబాద్: కళాశాల బస్సు ఢీకొని చెల్లెలు మృతి చెందగా, ఆమె అన్నకు స్వల్పగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు సోమవారం పేటకు చెందిన రంగయ్య, రంగమ్మ భార్యభర్తలు. బతుకుదెరువు కోసం గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి చింతల్ గణేష్ నగర్లో స్ధిరపడ్డారు.
వీరు కుమారుడు రంగసాయి మైసమ్మగూడలో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె రాజేశ్వరి (18) అదే కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువతోంది. ప్రతిరోజూ ఇద్దరు కలిసి హోండా యాక్టివాపై కళాశాలకు వెళుతున్నారు.
మంగళవారం ఉదయం 9 గటంలకు కళాశాలకు వెళుతుండగా బహుదూర్ పల్లి చౌరస్తా వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల బస్సు అదుపు తప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశ్వరి తలకు తీవ్రగాయామవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
రంగసాయికి స్వల్పగాయాలయ్యయి. అదే రోడ్డుపై వెళుతున్న విద్యార్ధులు అక్కడకు చేరుకొని డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ అవడంతో విషయం తెలుకున్న దుండిగల్ ఎస్ఐ అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
విద్యార్ధులు మృతదేహాన్ని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు నాయం చేయాలని డిమాండ్ చేస్తూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట రెండుగంటల పాటు ఆందోళన నిర్వహించి కళాశాల అద్దాలను ధ్వంసం చేశారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు బి. శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ రాము గౌడ్ కార్యకర్తలతో వెళ్లి బస్సు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్ధుల ఆందోళనకు దిగవచ్చిన యాజమాన్యం మృతురాలి కుటుంబ సభ్యులకు రూ. 7 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.