అద్దె మైకు, లైటు పురుగు: తెరాస నేత గుత్తాపై మల్లు భట్టి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెరాస నేత, ఎంపీ గుత్తా సుఖేందర రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. గుత్తా ఓ అద్దె మైకు లాంటివాడని, లైటు పురుగు లాంటివాడని సోమవారం నాడు దుమ్మెత్తి పోశారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన నైజం అని ఆరోపించారు.
తనను విమర్శించే అర్హత గుత్తాకు లేదన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు. నకిలీ విత్తనాలతో రైతులు నాశనమైపోతుంటే. వ్యవసాయ మంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నారన్నారు. నకిలీ నోట్ల కంటే నకిలీ విత్తనాల తయారీ చాలా ప్రమాదకరమన్నారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుంది: దత్తాత్రేయ
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ సోమవారం అన్నారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరుగుతోందని చెప్పారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ దేశం ముందుకెళుతోందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో అవినీతి రహిత పాలన నడుస్తోందన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.