కూటమి గెలిస్తే రెడ్లకు కాంగ్రెస్ షాక్ తప్పదా, ముఖ్యమంత్రి అతనేనా?: తెరపైకి భట్టి పేరు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు రోజులుగా ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. తమకు వంద స్థానాలు వస్తాయని తెరాస చెబుతుంటే, 70 నుంచి 80 సీట్లు వస్తాయని కూటమి నేతలు అంటున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. విపక్షాల నుంచి వినపడుతున్న కేటీఆర్.. హరీష్ రావు మాటలను పక్కన పెడితే తెరాసలో క్లారిటీ ఉంది. 2019 లోకసభ ఎన్నికల నాటికి కేసీఆర్ ఏం చేస్తారు, కేటీఆర్ సీఎం అవుతారా, హరీష్ రావు ఏం చేస్తారనే అంశాలు కాకుండా ఆ పార్టీ గెలిస్తే మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఓటు వేసి చిరంజీవి, జూ.ఎన్టీఆర్ ఏం చెప్పారంటే? గాడిదతో సమానమని వ్యాఖ్య
రేసులో చాలామంది కీలక నేతలు
కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. తెరాస నేతలు చెబుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఏడాదికో ముఖ్యమంత్రి అనే మాటలో నిజమెంతో అబద్దమెంతో కానీ .. రేసులో మాత్రం చాలామందే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కర, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ... ఇలా చాలామంది రేసులో ఉన్నారు.
ముఖ్యమంత్రి - ఉత్తమ్, సర్వే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కీలక పదవిలో మనం చూడవచ్చునని, హుజూర్ నగర్ నుంచి ముఖ్యమంత్రిని చూస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ స్వయంగా తానే సీఎం కావొచ్చునని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం కావొచ్చునని కనీసం డీప్యూటీ సీఎం అవుతానని, మంత్రినైనా అవుతానని వ్యాఖ్యానించారు.
దళిత సీఎంపై మాట తప్పిన కేసీఆర్
2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెరాస గెలిస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విపక్షాలు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తుంటాయి. కేసీఆర్కు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ దళిత నేతను తెరపైకి తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రేసులో పలువురు ముందున్నారు.
మల్లు భట్టి విక్రమార్క వైపు మొగ్గు
కూటమి అధికారంలోకి వస్తే ఆ సీనియర్ నేత, దళితు నేత అయిన మల్లు భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సీనియర్ నేతలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహలు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు. అయినప్పటికీ అధిష్ఠానం మల్లుభట్టి వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఈ సారి రెడ్డిలకు షాక్ తప్పకపోవచ్చునని అంటున్నారు.
ఆ అపవాదు తొలగించుకునే పనిలో
మల్లు భట్టిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కాంగ్రెస్ సీఎం పీఠం కట్టబెడుతుందన్న అపవాదును తొలగించుకోవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఢిల్లీ పెద్దలు భట్టినే సీఎం చేయాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిగా చేసి, దళిత నేతను ఉప ముఖ్యమంత్రిగా చేసే పరిస్థితులు కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు.