బాలికను పెళ్లాడి జైలుకు: భార్యను నరికి, కూతుర్ని చంపి, ఆత్మహత్య
నల్గొండ: జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో శనివారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికిన ఓ భర్త, తన మూడేళ్ల కూతురుని తీవ్రంగా గాయపరిచి, ఆపై తన ఎనిమిది నెలల చిన్నారిని ఎత్తుకుని విద్యుత్తు షాకు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో భర్త దేశెట్టి రాంచంద్రం (30), కూతురు అమ్ములు (8 నెలల) మృతి చెందారు. భార్య లావణ్య అలియాస్ కవిత మరో మూడేళ్ల కూతురు స్రవంతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన దేశెట్టి రాములు అతని భార్య లక్ష్మి కుటుంబం ఏడేళ్ల క్రితం తుర్కపల్లి మండలం వాసాలమర్రికి వలస వచ్చింది.
రాములు తన కొడుకు రాంచంద్రం వివాహం రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం కేశవపూర్కు చెందిన లావణ్య అలియాస్ కవితతో నాలుగేళ్ల క్రితం జరిపించారు.
ఏడాది పాటు కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత కొంతకాలానికే ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. కాగా, వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అంతేగాక, గొడవలతో అనేకసార్లు వీరిద్దరు పోలీసుస్టేషన్ను ఆశ్రయించారు. అయితే, వారికి పెద్దమనుషులు సర్దిచెబుతూ వచ్చారు.
కాగా, ఇటీవల మెదక్ జిల్లా తూప్రాన్ మండలం శివంపేటకు చెందిన బంధువైన బాలికను మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు రాములు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రాంచంద్రంను జైలుకు పంపారు. వారం క్రితం ఇంటికి వచ్చాడు. పుట్టింటిలో ఉంటున్న మొదటి భార్యను తీసుకువచ్చేందుకు పంచాయితీ పెట్టించాడు.
కుల పెద్దమనుషుల ఒప్పందంతో భార్య, పిల్లలను నాలుగు రోజుల క్రితం వాసాలమర్రికి తీసుకువచ్చాడు. మళ్లీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం మధ్య జరిగిన గొడవలో తీవ్రంగా కొట్టుకున్నట్లు గదిని చూస్తే తెలుస్తోంది. రాంచంద్రం గొడ్డలితో భార్య తలపై మోది నరికాడు. ఆమె కింద పడిపోవటంతో చనిపోయిందనుకున్నాడు.
ఆ తర్వాత మూడేళ్ల కూతురు స్రవంతిని తీవ్రంగా తలపై గాయపరిచాడు. దీంతో కళ్లు, తల ఉబ్బిపోయి స్పృహ కోల్పోయిన కూతురు కూడా చనిపోయిందని భావించాడు. 8 నెలల మరో కూతురు అమ్ములుని ఎత్తుకుని విద్యుత్తు హీటర్ని పట్టుకుని విద్యుదాఘాతం పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తండ్రి, కూతురు నేలపై విగత జీవులై పడిపోయారు.
కొన ఊపిరితో ఉన్న భార్య, చిన్నారిని పక్కింట్లోని బంధువుల బాలుడు చూసి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. ఘటన విషయం తెలిసిన స్థానికులు పెద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. నలుగురూ చనిపోయి ఉంటారని భావించి పోలీసులకు సమాచారం అందించారు.
తహసీల్దార్ నాగలక్ష్మి, ఎస్ఐ మసియొద్దీన్, ఏఎస్ఐ యాదయ్య ఘటనా స్థలికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న లావణ్య, స్రవంతిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.