మర్మాంగాలు కోసి చంపేశారు: భార్య వైవాహికేతర సంబంధమే కారణమా?
నల్లగొండ: ఓ వ్యక్తి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇందులో అతని భార్య ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను భార్య చంపించిందని ఆరోపణలు వచ్చాయి.
నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వీరండి వెంకటాచారి(53)కి, ఖమ్మం జిల్లా లింగాల సమీపంలోని ఓ గ్రామానికి చెందిన పద్మతో 28 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితమే సూర్యాపేట పూలసెంటర్ సమీపంలో సొంతిల్లు కట్టుకొని ఉంటున్నారు. వెంకటాచారి ఆటో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఫైనాన్స్ వ్యాపారం చేసే ఒంగోలు జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డితో వెంకటాచారికి వ్యాపార లావాదేవీలు ఏర్పడ్డాయి. దీంతో శ్రీనివాసరెడ్డి తరచూ వెంకటాచారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10:.30 గంటల సమయంలో ఫైనాన్స్ వ్యాపారులతో మద్యం సేవించిన వెంకటాచారి ఇంటికి వచ్చాడు.
ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న వెంకటాచారిని అరవకుండా గొంతు బిగించి, మర్మాంగాలను కోసి హత్యచేశారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం కారణంగానే భర్తను పద్మ హత్య చేయించిందనే అనుమానంతో పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ అబ్దుల్ రషీద్, సీఐ మొగలయ్య తెలిపారు.