హత్య: వంటగదిలో కాళ్లూ చేతులూ కట్టేసి శవం
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని అవంచ గ్రామంలో కర్నె పర్వతాలు (30) అనే వ్యక్తి దా రుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి తన ఇంటి ఆవరణలో పడుకున్న భర్త వ్యవసాయ పొలానికి వెళ్లి ఉంటాడని భార్య భావించింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లు, చేతులు కట్టి పర్వతాలును హత్య చేసి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంటగది ఆవరణలో పడేశారు.
మంగళవారం ఉదయం వంట మనిషి గదిని తెరిచేందుకు వెళ్లగా పర్వతాలు మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపింది. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు పెద్ద ఎత్తున గుమిగూడారు.
మహిళలు ఆగ్రహంతో పోలీస్ జీపును కింద పడేశారు. జీపులో ఉన్న జడ్చర్ల సీఐ జంగయ్య ప్రమాదం నుంచి బ యటపడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ప్రత్యేక బలగాలను రప్పించారు. గ్రామస్థులు ఎంతకూ వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిలో వెంకటమ్మ అ నే మహిళకు గాయాలయ్యాయి. మహబూబ్నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి, నాగర్కర్నూల్ సీఐ శ్రీనివాస్రెడ్డి గ్రామస్థులకు నచ్చజెప్పారు.
అనుమానితులను పోలీసులు తమ వాహనంలో తరలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పర్వతాలుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. పర్వతాలు హత్యకు గురయ్యాడని విచారణలో తేలితే దోషులను వదిలిపెట్టమని మహబూబ్నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. పర్వతాలు కాళ్ళు, చేతులు కట్టేసి ఉన్నాయని, హత్యగా భావిస్తున్నామని, పూర్తి వివరాలు విచారణలో తేలుతాయన్నారు.