వెంటాడిన మృత్యువు: అందరూ చూస్తుండగానే మహిళా టీచర్ దారుణ హత్య
నల్గొండ: జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని నందిపాడు చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం సుమారు 5 గంటలప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కె.నర్మద (27) అనే మహిళా ఉపాధ్యాయురాలిని ఆమె భర్త రాము దారుణంగా హత్య చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. నందిపాడులో నివసిస్తున్న నర్మద నాలుగేళ్ల క్రితం రామును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం నుంచి రాము ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె రూరల్ పోలీసు స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసు పెట్టింది.
ఆ తర్వాత కూడ రాము వేధిస్తుండగా రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పటినుండి వారిద్దరూ కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె పట్టణంలోని అరోరా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
సోమవారం పాఠశాల వదిలిన అనంతరం ఆమె ఇంటికి వెళ్తుండగా చౌరస్తా దాటిన తర్వాత రాము మారణాయుధం(పెద్ద సుత్తి)తో ఆమెపై దాడికి దిగి, ఆమె నెత్తిపై, చెవి భాగంలో బలంగా మోదడంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించింది.
అనంతరం నర్మద వెంట ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకుని పరారయ్యాడు. డీఎస్పీ గోనే సందీప్, వన్టౌన్ ఇన్స్పెక్టర్ డి.బిక్షపతి, ప్రొబేషనరీ ఎస్ఐ సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.