మంచం కోడుతో విచక్షణారహితంగా!: భార్య హతం.. అక్రమ సంబంధమే కారణం!
తెల్లవారుజామున నిద్రలేచిన పిల్లలకు.. బయట గడియ పెట్టి ఉండటం, తల్లి కనిపించకపోవడంతో.. ఏమి అర్థం కాలేదు. దీంతో కిటికీ నుంచి కష్టం మీద బయటకు దూకిన యశోద కొడుకు.. తలుపు తీసి లోపలికెళ్లాడు.
హైదరాబాద్: వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల రోజుకొకటి వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులోను.. వివాహేతర సంబంధాలే ఆమెను బలితీసుకున్నట్లు తేలిన సంగతి తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో వివాహేతర సంబంధం ఓ వివాహిత హత్యకు దారితీసింది. కట్టుకున్న భర్తే అత్యంత కర్కషంగా భార్యను హత్య చేశాడు. మంచం కోడుతో భార్య ముఖాన్ని ఛిద్రం చేసి.. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. పిల్లల ఏడుపులతో చుట్టుపక్కల స్థానికులు.. విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది.
దుర్గాభవానీ నగర్ బస్తీలో:
మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మద్దిమడుగు గ్రామానికి చెందిన గుడిపాటి నాగయ్య(38), యశోద(31) భార్యభర్తలు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబంతో కలిసి ఫిలింనగర్ లోని దుర్గాభవానీ నగర్ బస్తీలో నివసిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని నాట్కో ఫార్మా కార్యాలయం ఎదుట నాగయ్య టీ స్టాల్ నడిపిస్తున్నాడు. యశోద కూడా భర్తకు చేదోడు వాదోడుగా అక్కడే పనిచేస్తోంది.
డ్రైవర్తో వివాహేతర సంబంధం:
రేక సుదర్శన్ గౌడ్ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా యశోద వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇదే విషయంలో నాగయ్య-యశోదల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మరీ యశోదను మందలించాడు నాగయ్య. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. అసహనంతో రగిలిపోతూ వచ్చాడు. ఇదే క్రమంలో ఇక ఆమెను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు.
శనివారం.. యథావిధిగా తాగి ఇంటికొచ్చి:
శనివారం రాత్రి ఎప్పటిలాగే తాగి ఇంటికి చేరుకున్నాడు నాగయ్య. భార్యా పిల్లలతో కలిసి భోజనం చేశాడు. ఆపై యశోద పిల్లలతో కలిసి నిద్రకు ఉపక్రమించింది. నాగయ్య కూడా పక్క గదిలో పడుకున్నాడు. రాత్రి 2గం. సమయంలో యశోద మూత్రవిసర్జన చేయడానికి బయటకు రాగా.. అక్కడే మాటు వేసి ఉన్న భర్త ఆమెపై దాడికి దిగాడు.
మంచం కోడుతో విచక్షణారహితంగా ఆమె ముఖంపై దాడి చేశాడు. దీంతో యశోద ముఖం ఛిద్రమై.. అక్కడికక్కడే చనిపోయింది. హత్యానంతరం నాగయ్య సొంతూరు అమ్రాబాద్ పారిపోయాడు. పారిపోయే ముందు పిల్లలు నిద్రిస్తున్న గదికి గొళ్లెం పెట్టాడు. యశోద మృతదేహాన్ని బాత్రూంలోకి తీశాడు.
పిల్లల ఏడుపులతో:
తెల్లవారుజామున నిద్రలేచిన పిల్లలకు.. బయట గడియ పెట్టి ఉండటం, తల్లి కనిపించకపోవడంతో.. ఏమి అర్థం కాలేదు. దీంతో కిటికీ నుంచి కష్టం మీద బయటకు దూకిన యశోద కొడుకు.. తలుపు తీసి లోపలికెళ్లాడు. ఇల్లంతా రక్తం మరకలు, బాత్రూం వద్ద రక్తం మడుగులో తల్లి శవం ఉండటం చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. భార్య అనుమానంతోనే హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.