ఘోరం: కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న వృద్ధుడు
హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడ వద్ద ఘోరం జరిగింది. ఓ వృధ్ధుడు ఆత్మహత్యయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి వెంటనే 108 అంబులెన్స్కు సమాచారమిచ్చారు.
తీవ్రగాయాలు పాలైన వృద్ధుడిని వెంటనే అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్లో ఎక్కించి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వృధ్ధుడి శరీరం 30 శాతం వరకు కాలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
యువకుడి దారుణహత్య
వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. రేసు హన్మంతు (31) మండల కేంద్రంలోని నందమూరి నగర్లో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంటి దగ్గర రక్తపు మడుగులో విగతుడిగా పడి ఉన్న అతడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలో హన్మంతును గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. హన్మంతు భార్య కొద్ది రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లగా ఒక్కడే ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
నాలాలో పసికందు మృతదేహం
కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో మురికి కాలువలో పసికందు మృతదేహం బయటపడింది. శనివారం ఉదయం చెత్త పారబోయడానికి వెళ్లిన ఒకరు పసికందు మృతదేహాన్ని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్న మృతదేహాన్ని వెలికితీశారు. పసికందును ఎవరు పడేసి వెళ్లారనే కోణంలో పోలీసులు అక్కడి వారిని విచారిస్తున్నారు.