ఇన్ఫార్మర్ నెపంతో మెడికల్ స్టూడెంట్ హతమార్చిన మావోయిస్టులు
కొత్తగూడెం: పోలీసు ఇన్ఫార్మర్ (కోవర్టు) అనే అనుమానంతో ఓ మహిళా మాజీ మావోయిస్టును నక్సలైట్లు హత్య చేశారు. మెడికల్ స్టూడెంట్ రాధ అలియాస్ నీల్సో ఆరేళ క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. రాధను హతమార్చిన మావోయిస్టులు ఆమె మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో బుధవారం వదిలి వెళ్లారు.
హైదరాబాద్ నగరంలోని బాలాజీ నగర్(అంబేద్కర్ నగర్)కు చెందిన బంటి రాధ అలియాస్ నీల్సో(34) కొన్నేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తుండడంతో పార్టీ ఆమెకు పలు కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఇన్ఫార్మర్గా మారి తమ సమాచారం పోలీసులకు చేరవేస్తుందనే నెపంతో ఆమెను మావోయిస్టులు హతమార్చారు.

మృతదేహాన్ని తీసుకొచ్చి చెన్నాపురం సమీపంలో వదిలి వెళ్లారు. అయితే నీల్సో మృతదేహం వద్ద ఆంధ్రా-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరుతో లేఖ వదిలి వెళ్లారు. విప్లవ ద్రోహి నీల్సో అని, అందుకే ఆమెను హతమార్చినట్లు లేఖలో పేర్కొన్నారు. రాధపై అనుమానం రావడంతో 3 నెలల క్రితం కమాండర్ బాధ్యత నుంచి సస్పెండ్ చేశారు.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇంటెలీజెన్స్ అధికారులతో సంబంధం పెట్టుకున్నట్లు మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రాధ ద్వారా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలీజెన్స్ పోలీసులకు వెల్లడించింది అంటూ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది.
గతంలో శిల్పా, దేవేంద్ర అనే వ్యక్తులు రాధాను మావోయిస్టు పార్టీవైపు మళ్లించారు. శిల్పా కేసులో ఏపీ, తెలంగాణలో గతంలో ఎన్ఐఏ సోదాలు చేసి పలువురిని అరెస్ట్ చేసింది. పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి శత్రువు అనుసరిస్తున్న కోవర్టు ఎత్తుగడల్ని తిప్పికొడతాం! పోలీసుల కోవర్టు కుట్రలో భాగమైన విప్లవ ద్రోహిగా మారినందుకు నీల్సో(రాధ)ను చంపేశాం అని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.
కాగా, విషయం తెలుసుకున్న చర్ల సీఐ రాజువర్మ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం భద్రాచలం ఏరియా హాస్పిటల్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications