మావోయిస్టుల ప్లీనరీ: మూడు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం అలర్ట్
భూపాలపల్లి: మహారాష్ట్రలోని గడ్చిలోలి జిల్లా అడవుల్లో మావోయిస్టుల ప్లీనరీ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రెండు రోజుల క్రితం జయశంకర్ భపాలపల్లి జిల్లా సరిహద్దు నుంచి సుమారు 20 కి.మీ. దూరంలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మహారాష్ట్రలో ఫిబ్రవరి 21న జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. గడ్చిరోలి, చంద్రాపూర్, దంతెవాడ, జగ్గల్పూర్లాంటి ఏజెన్సీ జిల్లాల్లో బహుళజాతి కంపెనీలు అటవీ సంపదను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నుతున్నాయని, వారిని అడ్డుకోవాలని తీర్మానించారు.

కాగా, ప్లీనరీ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. జయశంకర్ జిల్లాలోని మహదేవ్పూర్, కాళేశ్వరం, గడ్చిరోలి జిల్లా సిరొంచతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మరోవైపు చత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో సైతం పోలీసు బలగాలు తనిఖీలు చేపట్టాయి. మూడు రాష్ట్రాల పోలీసులు అడవిని జల్లెడ పడుతుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఉద్రిక్త వాతావరణం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications