తెరాస నేతలకు వ్యతిరేకంగా మావోయిస్ట్ పోస్టర్లు, కలకలం
తెరాస అధికార పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో సిపిఐ మావోయిస్టు పార్టీ కెకెడబ్ల్యూ పేరుతో ఆదివారం వాల్పోస్టర్లు
భూపాలపల్లి : తెరాస అధికార పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో సిపిఐ మావోయిస్టు పార్టీ కెకెడబ్ల్యూ పేరుతో ఆదివారం వాల్పోస్టర్లు వెలిశాయి.
పోస్టర్లో చత్తీస్గఢ్ జైలులో ఉన్న తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని, తెలంగాణలో రాజ్య నిర్బంధాన్ని ఎత్తివేయాలని తెలంగాణ బుద్ధి జీవులు మౌనాన్ని వీడాలని, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు ఐక్య పోరాలకు సిద్ధం కావాలని ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడాలని పిలుపునిస్తూ సిపిఐ మావోయిస్టు కెకెడబ్ల్యూ పేరుతో మావోయిస్టులు పోస్టర్లు వెలిశాయి.
నేడు మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చిన సందర్బంగా రేపాకలో మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్ వెలియడం కలకలం సృష్టించింది.
శనివారం రాత్రి వెంకాపూర్ నుండి చత్తీస్గఢ్ బీజాపూర్లోని మెట్లవాగు దగ్గర ప్రయాణీకులతో వెళ్తున్న ప్రయివేటు బస్సును ప్రయాణీకులను దింపి దగ్ధం చేసి 24 గంటలు గడవకముందే రేపాకలో ఆదివారం ఉదయం మావోయిస్టుల పేరుతో వాల్పోస్టర్లు వేయడంతో గ్రామాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయి భారీ ఎత్తన పోలీసు బలగాలను మోహరించి అటు అడవులను ఇటు పల్లెలను జల్లెడ పడుతోంది. కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రేపాకలో నకిలీల, లేక మావోల పనేనా అనే కోణంలో తమదైన పద్ధతిలో ఆరాతీస్తున్నారు.