మేడారం హుండీల లెక్కింపు.. 6 రోజుల్లో రూ. 12.65 కోట్ల ఆదాయం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 28 నుండి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరిగింది. అయితే ఇక హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. కానుకల హూండీల లెక్కింపు ఆరో రోజు పూర్తయింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతోంది.
ఇక ఇవాళ ఆరో రోజు మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తయింది. ఇప్పటివరకు రూ.12.65 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఇవాళ 40 హుండీలను లెక్కించారు. ఈ హుండీల ద్వారా రూ.40 లక్షల 81 వేల 935 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆరు రోజుల్లో కలిపి మొత్తం 828 హుండీలను సిబ్బంది లెక్కించింది. దాంతో ఇప్పటివరకు రూ.12 కోట్ల 64 లక్షల 67 వేల 51 ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
అయితే హుండీల లెక్కింపు సమయంలో ఓ హుండీలో కాసులపేరు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే భక్తులు సమర్పించిన ఈ కాసులపేరు బంగారం కాదని సిబ్బంది స్పష్టం చేశారు. హుండీలో నకిలీ బంగారు వెండి వస్తువులు రావడం సహజమని అన్నారు. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అమ్మవార్లకు మొక్కుకొని ఇలా నకిలీ వస్తువులు సమర్పిస్తుంటారని అంటున్నారు.

మేడారం జాతర హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతం వాటాను పూజారులకు అందిస్తారు. గత జాతరలో సుమారు రూ. 13 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి దాని కంటే 3 రెట్లు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం లెక్కింపుకు దాదాపు 10 రోజులకు పైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లెక్కింపు పూర్తయ్యాకే మొత్తం ఆదాయం ఎంత వచ్చిందో అధికారికంగా ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications