వైద్య ఆరోగ్య శాఖ అంత వీజీ కాదు సర్.!మంత్రి హరీష్ రావు ముందున్న సవాళ్లు.!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్న టీ. హరీశ్ రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ తమిళి సై సంతకం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి హరీశ్ రావు విస్త్రుతంగా ప్రచారం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. అయినా పార్టీ ఓటమి చెందడంతో నైతికంగా కుంగిపోకూడదనే ఉద్దేశంతో హరీష్ రావుకు అదనపు బాద్యతలు కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

హరీష్ కు స్వాగతం పలుకుతున్న సమస్యలు.. ఎలా అదిగమిస్తారనే అంశంపై ఆసక్తి..
మంత్రి హరీశ్రావుకు సీఎం చంద్రశేఖర్ రావు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్కు వైద్యారోగ్య శాఖను కేటాయించారు. టీఆర్ఎస్లో ఈటల రాజేందర్ ఉన్నప్పుడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. పార్టీలో జరిగిన పరిణామాలతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉపఎన్నికలో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం కూడా చేసారు. టీఆర్ఎస్లో హరీశ్ రావు పరిస్థితి కూడా తన లాగే ఉంటుందని ఈటల రాజేందర్ ఉప ఎన్నికలో ప్రచారం చేశారు. అయితే ఈటల ప్రచారాన్ని సీఎం చంద్రశేఖర్ రావు తిప్పికొట్టారు. మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అప్పగిస్తూ ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

పేరుకుపోయిన సమస్యలు.. అధిగమించడం ఎట్ల..?
ఇదిలా ఉండగా కరోనా మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తలు హల్ చేస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు పెను సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆసుపత్రులను గుర్తించి మెరుగుపరచాల్సిన ప్రథమ కర్తవ్యం హరీష్ ముందున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది, డాక్టర్లు వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మౌళిక సదుపాయాలు నిల్.. ఇబ్బందుల్లో పేషెంట్లు..
అంతే కాకుండా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో వైద్య సిబ్బందికి ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని డ్రెస్సింగ్ రూమ్, బాత్ రూమ్, మంచినీరు, బోర్ వాటర్, వివిధ రోగాల బారిన పడిన రోగులకు కూడా బాత్రూంలు, తదితర సమస్యలను విన్నవించుకునేందుకు పథకం రచిస్తున్నారు. దీంతో పాటు గతంలో ప్రభుత్వ ఆసుత్రుల్లో బయో మెట్రిక్ ద్వారా సిబ్బంది హాజరును పర్యవేక్షించే వెలసుబాటు ఉండేది. కాని అనేక ఆసుత్రుల్లో హాజరు వందకు వంద శాతం ఉంటున్నా వైద్యులు అందుబాటులో లేని వైనం విస్మయాన్ని కలిగిస్తోంది. బయోమెట్రిక్ సాంకేతిక విదానాన్ని కూడా ఎలా ఏమార్చుతున్నారన్నది అంతుచిక్కని అంశం. ప్రధానంగా ఈ సమస్య పరిష్కారంపై హరీష్ రావు మొట్టమొదల దృష్టి సారించాల్సి ఉంటుంది.

కోవిడ్ మరణాల లెక్కల సంగతేంటి.. లెక్క సరిగా లేనప్పుడు పరిహారం ఎలా చెల్లిస్తారు?
ఇక హరీష్ రావు ముందున్న మరో అతిపెద్ద సవాల్ కోవిడ్ మూడోదశను అధిగమించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కోవిడ్ మరణాలకు సంబంధించిన పరిహారాన్ని సకాలంలో అందించడం. కోవిడ్ మరణాలకు సంబందించి పరిహారాన్ని అందించడంలో కేంద్రానికి పక్కా నివేదిక పంపించాల్సి ఉంటుంది. గతంలో కోవిడ్ మరణాల సంబందించి లెక్కలను తక్కువగా నివేదించారనే అపవాదు తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు కోవిడ్ మరణాలకు సంబందించిన ధరకాస్తుల సంఖ్య దిమ్మదిరిగే రేంజ్ లో కనబడుతోంది. మరి ఈ సమస్యను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఎలా అధిగమిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications