కిడ్నాప్: చెరువులో శవమై తేలిన వ్యాపారి శ్రీనివాస్
నల్గొండ: జిల్లాలోని సూర్యాపేటలో రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన వ్యాపారి సంకోజు శ్రీనివాస్(35) మంగళవారం ఉదయం స్థానిక చౌదరి చెరువులో శవమై తేలాడు. కాగా, శ్రీనివాస్ అపహరణపై సోమవారం సూర్యాపేట పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ తల్లి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆస్తి తగాదాల నేపథ్యంలో శ్రీనివాస్, అతని కుటుంబసభ్యులకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగతున్నాయి. హైదరాబాద్లో నివాసముంటున్న శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతికి సూర్యాపేట వచ్చాడు.
ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన ఆయన భార్య సోమవారం సూర్యపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, మంగళవారం ఉదయం శ్రీనివాస్ మృతదేహం సూర్యాపేట చౌదరి చెరువులో లభ్యమైంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి శ్రీనివాస్ హైదరాబాద్లో ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు.
ఇల్లెందులో అంతర్జిల్లా దొంగలు అరెస్ట్
ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో ముగ్గురు అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల నుంచి రూ. 8 లక్షల విలువైన నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న దొంగలను పోలీసులు విచారిస్తున్నారు. చోరీలపై ఆరా తీస్తున్నారు.
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
వరంగల్ జిల్లా ఎస్పీ ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. లొంగిపోయిన దంపతులు భిక్షపతి అలియాస్ కిరణ్, రుక్మిణి అలియాస్ సునీత. వీరు దండకారణ్య డివిజన్ కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారు. వీరిపై పోలీసులు ఇప్పటికే రూ. 6 లక్షల రివార్డు ప్రకటించారు. వీరి స్వస్థలం ఆత్మకూరు మండలం మహ్మద్గౌస్పల్లి.