Winter: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోన్న చలి..
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకు వర్షాలు కురవడంతో చలి తీవ్రత తక్కువగా ఉండేది. కానీ వర్షాలు తగ్గడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. వచ్చే పది రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీల మధ్య నమోదవుతాయి. ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు కూడా వస్తుంది. అయితే ఇది చలి కాలం ఆరంభం మాత్రమేనని.. ఇక నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ లో హైదరాబాద్లో చలి తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నవంబర్లో పొడి వాతావరణం అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చల్లని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, BHEL ఫ్యాక్టరీ ప్రాంతం 16.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. కుత్బుల్లాపూర్లో 18.4 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరువు 18.9, మారేడ్పల్లి 19.1, లింగంపల్లి 19.1, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) 19.5, రాజేంద్రనగర్లో 19.7 ఉష్ణోగ్రత నమోదు అయింది. చలి కాలం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే ఈ సంవత్సరం చలి తీవ్ర తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెల్లవారుజామున చలితీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు అవుతాయని.. అయితే వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల చలి తీవ్రత తక్కువ ఉండొచ్చని పేర్కొంది.












Click it and Unblock the Notifications