వామ్మో.. హైదరాబాద్ లోని ఆ ప్రాంతంలో నెలకు రూ. 5.4 కోట్లు అద్దె.. అడ్వాన్స్ రూ. 42 కోట్లు..!
హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటోంది. రోజురోజుకూ రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. హైదరాబాద్ లో వాతావరణం, సేఫ్ టీ దృష్ట్యా మరిన్ని టెక్ కంపెనీలు భాగ్య నగరానికి క్యూ కడుతున్నాయి. అయితే తాజాగా అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్ లో వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు భారీ డీల్ కుదుర్చుకుంది.
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏకంగా 2,64,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ తాజాగా లీజుకు తీసుకుంది. 2025, జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఫీనిక్స్ సెంటార్స్ బిల్డింగ్ లో 2.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. బిల్డింగ్ లోని 3, 4 ఫ్లోర్లలో ఈ కార్యాలయ స్థలం విస్తరించి ఉంది. హైదరాబాద్ లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో ఇప్పటివరకు కుదిరిన అతిపెద్ద లీజు ఒప్పందాల్లో ఇదొకటిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
చదరపు అడుగుకు రూ.67 చొప్పున మొత్తం స్థలానికి మైక్రోసాఫ్ట్ నెలకు రూ.1.77 కోట్ల కనీస అద్దెగా ఉంది. అలాగే నిర్వహణ వ్యయాలు, ఇతర ఛార్జీలు కలిపి మొత్తం రూ. 5.4 కోట్లు చెల్లించనుంది. అంతేకాక ఏటా అద్దె 4.8 శాతం పెరగనుంది. ఇక సెక్యూరిటీ డిపాజిట్ కింద మైక్రోసాఫ్ట్ రూ.42.15 కోట్లు జమ చేసినట్లు ప్రాప్ స్టాక్ తెలిపింది. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద రూ. 92.94 లక్షలు చెల్లించింది.

ఇతర డీల్స్ చూస్తే.. హైదరాబాద్ లో 2024లో టీసీఎస్ సంస్థ 10.18 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇక్కడ నెల అద్దె రూ. 4.3 కోట్లుగా ఉంది. అలాగే 2024 డిసెంబరులో ఫేస్ బుక్ సంస్థ తన ఆఫీస్ స్పేస్ లీజింగ్ డీల్ ను రెన్యూవల్ చేసుకుంది. మొత్తం ఇది 3.7 లక్షల చదరపు అడుగులు కాగా.. నెల అద్దె రూ. 2.8 కోట్లుగా ఉంది. భారత్ లోనే ప్రీమియం, ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ అడ్డాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. పలు అంతర్జాతీయ టెక్నాలజీ, ఆర్థిక సేవల కంపెనీల కార్యాలయాలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు అనువైన ప్రదేశంగా భాగ్యనగరం ఉంది.












Click it and Unblock the Notifications