హైదరాబాద్ ను వణికిస్తున్న చలిగాలులు-అటు ఒమిక్రాన్ : మరో వారం ఇంతే- వైద్యుల హెచ్చరికలు..!!
ఇక వైపు విదేశాల నుంచి వస్తున్న వారితో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. మరో వైపు కరోనా కేసులు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. వరుస పండుగలు. జన సమూహాలు. కేంద్రం హెచ్చరికలు. అవసరమైతే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్ లో చలి మామూలుగా లేదు. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 2015 తరువాత ఇంత తక్కువ స్థాయిలో చలి నమోదు కావటం ఇదే తొలిసారి. మరో నాలుగు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో సాయంత్రం ఆరేడు గంటల నుంచే చలి ప్రభావం చూపిస్తోంది. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఒక్కరోజులోనే కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు మూడు డిగ్రీలు తగ్గిపోవడం చలి తీవ్రత మరింతగా పెరిగింది. ఇక, తెలంగాణలోని జిల్లాల్లోనూ చలి పెరిగింది. ఈ సీజన్ లో అత్యల్పంగా 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత కుమురం భీం జిల్లా సిర్పూరు(యూ)లో నమోదు కాగా, గిన్నెదరిలో 3.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. సిర్పూరు(యూ)లో 3.8 నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా బేలాలో కూడా 3.8, అర్లి(టీ)లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

2015 తరువాత ఈ స్థాయిలో ఇప్పుడే
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 2015 జనవరి 10న సంగారెడ్డిలోని కోహిర్లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. అంతకుముందు 2014 డిసెంబర్ 18న కామారెడ్డి జిల్లా మద్నూర్లో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం మరలా ఇప్పుడేనని అధికారులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం రోజుల పాటు గణనీ యంగా పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతా వరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొ న్నారు.

అప్రమత్తంగా ఉండాల్సిందే
బుధవారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో సాధా రణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశముందంటూ అధికారులు వెల్లడించారు. ఇక, ఇదే సమయంలో రిస్కు దేశాల నుంచి వస్తున్న వారిలో ఒమిక్రాన్ కేసులు గుర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణలో గుర్తించిన నాలుగు కేసులతో మొత్తం రాష్ట్రంలో నమోదైన ఓమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. ఈ సమయంలో వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇంత చలి వణిస్తున్న వేళ..ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు ఉదయం చలిగాలిలో వాకింగ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇక, తాజాగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్ తీసుకోని వారికి ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. డెల్టా కంటే మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోందని కేంద్రం తేల్చింది.












Click it and Unblock the Notifications