షర్మిలకు మంత్రి అజయ్ సవాల్ - డబ్బులిస్తేనే నీ అన్న పదవులు: దమ్ముంటే గెలిచి చూపించు..!!
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు మంత్రి అజయ్ సవాల్ చేసారు. షర్మిల పాదయాత్రలో భాగంగా ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు..ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలనే నిర్ణయం పైన స్పందించారు. రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పాలకుల పీడ విరగడైందని అనుకుంటే.. మళ్లీ తయారవుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని.. షర్మిలకు తెలంగాణలో ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. పరిటాల రవి, మొద్దు శ్రీను హత్య ఘటనలు ప్రజలు మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు.
డబ్బులు తీసుకొని మంత్రి పదవులు
వైఎస్కు, ఆయన కొడుకు జగన్కు డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వడం, డబ్బులు తీసుకుని మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందంటూ పువ్వాడ ఆరోపించారు. ఏమీ ఆశించకుండా పదవులు ఇచ్చే నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణ హక్కుగా ఉన్న బయ్యారం ఉక్కును తరలించుకుపోవాలని చూసిన వాళ్లే మళ్లీ బజార్లపై డాన్స్ ఆడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కూలీలను పెట్టుకుని, వారికి టీషర్టులు తగిలించి చేస్తున్నది పాదయాత్ర కాదని, అది షర్మిల క్యాట్వాక్ అని ఎద్దేవా చేసారు.
పోటీ చేసి గెలిచి చూపించు
ఒట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే మీ అన్నలా డబ్బులిచ్చి తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు. మీ తండ్రి, అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు చూస్తే అరాచకానికే సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. దమ్ముంటే ఖమ్మంలో లేదంటే పాలేరులో పోటీ చెయ్.. ఎక్కడ పోటీచేసినా ఓడించి తీరుతామని..దమ్ముంటే గెలిచి చూపించాలని మంత్రి సవాల్ చేసారు. ఖమ్మంలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక, బాధ్యత లేని వారు కూసే కూతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
పాదయాత్ర కాదు..క్యాట్ వాక్
వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొడుకు, కూతురు, అల్లుడు, కొండలరావుతో కలిసి బయ్యారం గనులు, భూములు ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు షర్మిల పర్యటనకు అడ్డంపడతానంటే వద్దని చెప్పానని వివరించారు. పాదయాత్ర పేరుతో కొద్ది సేపు నడిచి.. ఏసీ బస్సులో పడుకొని.. బిర్యానీలు తిని సాయంత్రం డాన్స్ చేసి..ఎవరిని మోసం చేస్తాంటూ షర్మిల పాదయాత్ర తీరు పైన మంత్రి అజయ్ ఫైర్ అయ్యారు. షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించటంతో..ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.