మానవీయ కోణంలో ఆలోచించి అప్పులు: నాబార్డ్ సదస్సులో ఈటెల (ఫోటోలు)
హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వాల లక్ష్యం కావాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాల విషయంలో బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం హోటల్ తాజ్కృష్ణలో నిర్వహించిన స్టేట్ క్రెడిట్ సెమినార్ 2016-17కు మంత్రి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న, ప్రజలకు ఇస్తున్న రుణాలపై బ్యాంకులు ఒకసారి బేరీజు వేసుకోవాలన్నారు. వ్యవసాయరంగానికి ఇచ్చే రుణాలు తిరిగి వివిధ రూపాల్లో బ్యాంకులకే లాభాలు తెస్తాయన్నారు. అదేవిధంగా ఇచ్చిన లోన్లు సక్రమంగా ఉపయోగపడితేనే ప్రయోజనం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు.
మానవీయ కోణంలో ఆలోచించి అప్పులు: నాబార్డ్ సదస్సులో ఈటెల
దేశంలో గ్రామీణుల్లో 59 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వారికి ఇచ్చే రుణాలు తక్కువ మొత్తంలో ఉన్నా అవి ఎంతో మందికి ఉపాధి మార్గాలు చూపుతాయని గుర్తుచేశారు. వాటి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకర్లను కోరారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులంటే తెలియనివాళ్లు ఉన్నారన్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నా, కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి చెప్పారు.
మానవీయ కోణంలో ఆలోచించి అప్పులు: నాబార్డ్ సదస్సులో ఈటెల
ఇకమీదట రుణమాఫీ చెల్లింపుల్లోనూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వ్యవసాయరంగంతోపాటు ఇరిగేషన్, వాటర్గ్రిడ్వంటి అనేక సంక్షేమ పథకాలకు నాబార్డ్ సహకారం అందించాలని కోరారు. రాష్ర్టానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రాధాన్య రంగాలకు రూ.59,831కోట్ల రుణం అవసరం అవుతుందని నాబార్డ్ అంచనా వేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక అంచనాలను ఈ సందర్భంగా విడుదల చేశారు.
మానవీయ కోణంలో ఆలోచించి అప్పులు: నాబార్డ్ సదస్సులో ఈటెల
నాబార్డ్ సీజీఎమ్ వీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, నాబార్డ్ రుణ అంచనా రూ.59,831కోట్ల రుణ ప్రణాళికలో పంట రుణాలకు (స్వల్పకాల మూలధనం) రూ.30,435కోట్లు, వ్యవసాయ కాలపరిమితి రుణాలకు రూ.13,009 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార రుణాలు రూ.8,464కోట్లు ఇతరత్రా ప్రాధాన్యరంగాలకు రూ.7,923కోట్లు అంచనా వేసినట్టు తెలిపారు. సదస్సులో భాగంగా ప్రాధాన్యరంగాల పరిధిలోని ప్రధాన రంగాలు, ఉప రంగాల రుణ సామర్థ్యం, రాష్ట్రంలో వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి అవరోధంగా నిలిచాయని నాబార్డ్ గుర్తించిన కీలక అంతరాలకు సంబంధించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేశారు.
మానవీయ కోణంలో ఆలోచించి అప్పులు: నాబార్డ్ సదస్సులో ఈటెల
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పథకాలకు నాబార్డ్ సహకారం ఎంతో బాగుందన్నారు. సదస్సులో భారతీయ రిజర్వ్బ్యాంక్ ప్రాంతీయ సంచాలకుడు ఆర్ఎన్దాస్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే ప్రదీప్చంద్ర, ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ ఎన్ పటేల్, వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్చందా తదితరులు పాల్గొన్నారు.