దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదు?
దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలోను సాధ్యం కాని రీతిలో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్తు దీపం చీకటిని పారద్రోలి ఎలా వెలుగులను విరజిమ్ముతుందో.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కూడా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని అభివర్ణించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ పాలనలో ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని విమర్శించారు.
భారత రాష్ట్ర సమితి నాయకుడు రాపర్తి మహేష్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారంతా మంత్రి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అనే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నారని, ఆయన్ను మించిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని ఘంటాపథంగా చెబుతున్నానన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యపడుతుందని, ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రంలో కేవలం 6 గంటలే విద్యుత్తు ఇస్తున్నారని, ఒకరిద్దరు సంపన్నులను మరింత సంపన్నులను చేసే దిశగా పరిపాలన కొనసాగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిని గద్దె దించాలని ప్రజలే నిర్ణయించుకున్నారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పంచాయతీగా ఉన్న పిల్లలమర్రి లో రూ. 2 కోట్ల నిధులతో సీసీ రహదారులు నిర్మించామని, నేడు రూ.22 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణతోపాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి వచ్చిన నాయకులందరికీ బీఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.