వర్షాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలలో వరుణయాగాలు: మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలు సాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు
అనేక గ్రామాలలో కప్పతల్లి పూజలు చేస్తున్నారు. వర్షాలు కురవాలని వరుణ యాగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కీలక ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కోసం ప్రముఖ దేవాలయాలలో ప్రత్యేకంగా వరుణ యాగాలు, శాంతి పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

రైతులు, ప్రజల కోసం నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఊరటనిచ్చేలా, సకాలంలో వర్షాలు కురిసేలా ప్రముఖ దేవాలయాలలో వరుణ యాగాలు నిర్వహించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
ప్రస్తుత సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం పైన స్పందించిన మంత్రి రైతాంగాన్ని ఆదుకోవడానికి, జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడానికి దైవ బలం తోడు కావాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
శాస్త్రోక్తంగా అన్ని దేవాలయాల్లో వరుణయాగాలు
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితుల సూచనల మేరకు శాస్త్రోక్తంగా వరుణ యాగాలను నిర్వహించనున్నామని తెలిపారు.ముఖ్యంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, భద్రాచలం రాముని ఆలయంతో పాటు అన్ని జిల్లాలలోని ప్రధాన శైవ, వైష్ణవ ఆలయాలలో ఈ వరుణ యాగాలు, హోమాలు జరగనున్నాయి.
191 మందికి నియామక పత్రాలు
కాగా రాష్ట్రంలోని 47 ఆలయాలకు సంబంధించి అర్చకులు, వేదం పండితులు, సిబ్బంది, వాద్య కళాకారులు తదితర విభాగాలలోని వారికి 191 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారికి వచ్చే ఏడాది నుంచి పురస్కారాలు అందజేస్తామని తెలిపారు అన్ని విభాగాల నుంచి నివేదికలను తెప్పించుకొని ఉత్తమ సేవలను అందించిన వారిని సెలెక్ట్ చేస్తామని వారిని ప్రభుత్వం నుంచి గుర్తిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications