కాక పుటిస్తోన్న కేటీఆర్ ట్వీట్: దొంగలముఠా: ఆ తెలివి లేదుగానీ..: బండి సంజయ్ కౌంటర్
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. ప్రాణాలను హరించి వేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ను మహమ్మారిగా ప్రకటించాయి. దీనికి అనుగుణంగా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తోన్నాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోన్న వారితో హైదరాబాద్ ఆసుపత్రులు నిండిపోతోన్నాయి. వారికి అందించడానికి ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Advance Monsoon: నో వెయిటింగ్: తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్
తెలంగాణకు 1,050 యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లు
బ్లాక్ ఫంగస్ను నివారించడానికి ఉద్దేశించిన ట్రీట్మెంట్లో యాంఫోటెరిసిన్ బీ (Amphotericine B) ఇంజెక్షన్ కీలకంగా మారింది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఈ కొత్త మహమ్మారిని నిర్మూలించడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో- ఈ ఇంజెక్షన్కు డిమాండ్ భారీగా పెరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం రేషనలైజ్ చేసింది. ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో కేటాయించాలనేది నిర్ధారించింది. దీనిపై ఓ జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో అధిక వాటా మహారాష్ట్ర, గుజరాత్లదే. మహారాష్ట్ర-16,500, గుజరాత్-15,000 ఇంజెక్షన్లను కేటాయించింది. ఇందులో తెలంగాణ వాటా 1,050.
కేటీఆర్ అసంతృప్తి..
ఈ కేటాయింపులపై మంత్రి కేటీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్ తీవ్రంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు ఇంత తక్కువ ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేవలం 1,050 మాత్రమే మంజూరు చేసిందని నిలదీశారు. గుజరాత్కు 15,000 యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను కేటాయించిందని గుర్తు చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రాతిపదికన తీసుకుందంటూ వరుస ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా రాజకీయ దుమారానికి దారి తీసింది. బీజేపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు.
ఆ తెలివి లేదు గానీ..
కోవిడ్ ట్రీట్మెంట్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని వారు తప్పుపట్టారు. కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్ఫోర్స్ ఓ దొంగలముఠాలా తయారైందని బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టాస్క్ఫోర్స్లో అనుభవం ఉన్న వారిని నియమించుకోవాల్సి ఉంటుందని, దీనికి భిన్నంగా కేసీఆర్ సర్కార్ ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ టాస్క్ఫోర్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఉపయోగించే తెలివి లేదు గానీ.. కేంద్రం టీకాలను ఇవ్వట్లేదంటూ ఎలా విమర్శిస్తారని నిలదీశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తోన్న కేసీఆర్.. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను ఎందుకు చేర్చలేదని అన్నారు.
ఆసుపత్రుల్లో అన్నీ సమస్యలే..
తాము ఇదివరకే ఆసుపత్రులను సందర్శించామని, కేసీఆర్ ఇప్పుడు దాన్ని మొదలు పెట్టారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ సమస్యలే ఉన్నాయని, అవి కేసీఆర్కు మాత్రం కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అనుగుణంగా సిబ్బంది ఉండట్లేదని, దీనివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పేషెంట్ల కుటుంబ సభ్యులే ప్రమాదకరమైన కోవిడ్ వార్డుల్లో సేవలు చేస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది సమస్యలు చెప్పుకుంటుంటే వినకుండా నేరుగా వచ్చి తనను కలవమని కేసీఆర్ చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
Recommended Video