రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్ - అరాచకం..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం చేస్తన్నారని మండిపడ్డారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలే పార్టీ విధానమా అని ప్రశ్నించారు. ప్రగతిభవన్ ను బాంబులతో పేల్చేయాలనటమే కాంగ్రెస్ వైఖరా అని నిలదీసారు. అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్న అంశాలను ప్రశ్నించారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రేవంత్ ప్రకటించటాన్ని మంత్రి కేటీఆర్ తప్పు బట్టారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మధ్య సంవాదం చోటు చేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ నాయకులది అరాచకం
అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం చేస్తన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా రావడం లేదని చెప్పుకొచ్చారు. ప్రగతి భవన్ను పేల్చేయాలని వారి అధ్యక్షుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటూ రేవంత్ పైన ఫైర్ అయ్యారు.
అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖరి అంటూ ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడొచ్చా అని నిలదీసారు. కాంగ్రెస్ నాయకుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదన్నారు. ఎవరు సీఎంగా ఉంటే వారే ప్రగతి భవన్ లో ఉంటారన్నారు. కాంగ్రెస్ కు ప్రజల నుంచి ఆదరణ లేదని, ఈ రకమైన తీరుతో ఎక్కడా పార్టీ కాకుండా పోతోందని పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ పై వైఖరి తేల్చండి
ధరణి పోర్టల్తో రైతులు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆరేళ్ల కాలంలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ఈ ఏడాదిన్నార కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని వివరించారు. ఒకట్రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా గందరగోళం నెలకొందని చెప్పడం సరికాదన్నారు.
ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెబుతున్నాడని మండిపడ్డారు. తాము అలా చెప్పలేదంటూ శ్రీధర్ బాబు సమర్ధించుకొనే ప్రయత్నం చేసారు. దీనికి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. వాళ్ల అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తా అని ప్రకటనలు చేస్తుంటే... మ అధ్యక్షుడు అలా మాట్లాడలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారంటూ మండిపడ్డారు. ధరణిని రద్దు చేయడం పార్టీ విధానమే అయితే.. పార్టీ పరంగా చెప్పండని డిమాండ్ చేసారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు.
కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం
ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం పైన మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. సింగరేణిని కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం కుట్రను తిప్పి కొడతామని స్పష్టం చేసారు. అవసరమైతే కార్మికులతో పాటు రాజకీయపక్షాలను కలుపుకుని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు సింగరేణిని కాపాడుకునేందుకు ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్దమని కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. బయ్యారం ఉక్కుపై ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications