లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు - ఎంతటివారున్నా వదిలిపెట్టం: మంత్రి కేటీఆర్..!!
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. రద్దయిన పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. త్వరలోనే అన్ని చర్యలు తీసుకొని పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో హాజరైన వారిని అర్హులుగా గుర్తిస్తామని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం కోచింగ్ మెటీరియల్ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఇద్దరు చేసిన తప్పు కారణంగా ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయ నేతల మాటలు నమ్మవద్దని సూచించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవస్థ చక్కగా ఉందని వివరించారు. నిధులు..నీరు..నియామకాల కోసం తెలంగాణ పోరాటం సాగిందని.. యువతకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. పరీక్షలు రాసి క్వాలిఫై అయిన వారికి తిరిగి పరీక్షలు రాయాలంటే ఉండే బాధను తాము అర్దం చేసుకోగలమని వివరించారు. పరీక్షకు తిరిగి హాజరయ్యే అభ్యర్దులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని..మెటీరియల్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

రీడింగ్రూమ్లు 24 గంటలు తెరిచే ఉంటాయి.. భోజన వసతి కూడా ఉంటుందన్నారు. గత ఎనిమిదేళ్లుగా చిత్తశుద్ధితో టీఎస్పీఎస్సీ పనిచేస్తోందన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యానాలను పట్టించుకోవద్దన్నారు. ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి ఇద్దరే కాదు.. ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు కేటీఆర్. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తింపు పొందిందని వివరించారు. 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా.. ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే నని కేటీఆర్ వివరించారు.

డిజిటల్ చెల్లింపులు.. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అని వివరించారు మంత్రి కేటీఆర్. 99 పరీక్షలను నిర్వహించటం ద్వారా. లుగున్నర లక్షల మంది స్టూడెంట్స్ హాజరయ్యారని కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత సాధించిందని చెప్పారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్ పీఎస్సీ గుర్తింపు పొందిందని కేటీఆర్ వివరించారు. ఈ విషయంలో రాజకీయంగా చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్తగా చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి వెనుక ఉన్నవారిని గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డీజీపీని కోరుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications