దురుద్దేశంతోనే..: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతోనే తనను లాగుతున్నారని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసే విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని కేటీఆర్ గుర్తు చేశారు.

అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ తెరలేపారని కేటీఆర్ అన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వమని, ఒక దురదృష్ణకర ఘటనను చూపి ఉద్యోగాలు ఆపాలపి చూస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని, చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయన్నారు కేటీఆర్. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారానికి అంటగట్టి.. యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధిరాలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. శవాలపైనే చిల్లర ఏరుకునే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారాయని మండిపడ్డారు. కొంతమంది రాజకీయ నేతల ఉచ్చులో యువత చిక్కుకోకుండా ఉద్యోగాల సన్నద్ధతను కొనసాగించాలని కేటీఆర్ కోరారు.












Click it and Unblock the Notifications