ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం.. షెడ్యూల్ ఇదే!!
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఖమ్మం పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిర్వహించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
శనివారం ఉదయం 9 గంటలకు కేటీఆర్ ఖమ్మం చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మంత్రి ప్రసంగిస్తారు. ఇక మంత్రి కేటీఆర్ పర్యటన, ఆపై నిర్వహించనున్న సభ నేపథ్యంలో సభకు భారీగా ప్రజలు తరలి వచ్చేలా టిఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖమ్మం మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఇలా
ఇక ఈ రోజు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ షెడ్యూల్ వివరాలు చూస్తే ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రి కేటీఆర్ బయలుదేరుతారు. 9 గంటలకు మమత జనరల్ హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ లో మంత్రి కేటీఆర్ దిగుతారు. 9 గంటల 15 నిమిషాలకు లకారం చెరువు పై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి, మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ ఈ డి లైటింగ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. 9 గంటల 45 నిమిషాలకు రఘునాధపాలెం లో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్కు, బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
ఉదయం 10 గంటల 15 నిమిషాలకు టేకులపల్లి లో 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రగతి వనాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం పాత మున్సిపల్ కార్యాలయంలో సిటీ లైబ్రరీ, ఐటి హబ్ సర్కిల్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిర్మించిన ఫుట్ పాత్, దానవాయిగూడెం లో ఎఫ్ఎస్టిపీ, ప్రకాష్ నగర్ లోని వైకుంఠధామం ని ప్రారంభిస్తారు. ఆపై రెండు గంటలకు శ్రీనివాస్ నగరంలో మానవ వ్యర్థపదార్థాలను శుద్ధి చేసే కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు .ఆ తర్వాత ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నర్సరీని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

పార్టీ నేతలకు మంత్రి దిశా నిర్దేశం
ఇక మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో, పార్టీ కి చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లా సమగ్ర అభివృద్ధి పై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఖమ్మం జిల్లాలో పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అసహనం తో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మంత్రి కేటీఆర్ లంచ్ చేయనున్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు పొంగులేటి నివాసానికి అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావు తో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్ళనుండటం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications