60 లక్షల మంది సైన్యం ఉంది, జాగ్రత్త, బీజేపీ నేతలకు కేటీఆర్ వార్నింగ్
మునుగోడు బై పోల్కు సర్వం సిద్దమైంది. ఎన్నికల కమిషన్ అన్నీ ఏర్పాట్లు చేసింది. నిన్నటితో ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మునుగోడులో గల పల్లివెల మండలంలో బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాయపడ్డవారిని మంత్రి కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. ఈ క్రమంలో బీజేపీ నేతల తీరును తప్పుపట్టారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ అండ్ కో చేసిన దాడి కరెక్ట్ కాదని కేటీఆర్ అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డి ఇతరులపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. రాళ్లు, కర్రలతో అటాక్ చేయడం ఏంటీ అడిగారు. దాడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. దాడి చేసి.. ఉల్టా మమ్మల్నే దాడి చేశారని అనడం కరెక్ట్ కాదన్నారు.
హింసకు తావు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే బీజేపీ నేతలు దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. బీజేపీ చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శలు చేశారు. తమ పార్టీకి చెందిన నేతల రక్తాన్ని చవిచూశారని పేర్కొన్నారు.
ఈటల రాజేందర్ పీఏ దాడి చేయించారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దాడి చేసింది వారు, రెచ్చగొట్టింది వారు.. దాడి చేసి, సానుభూతి కోసం.. ఇతర విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి పిడికెంత మంది ఉన్నారని.. తమకు 60 లక్షలు మంది కార్యకర్తలు ఉన్నారని గుర్తుచేశారు. తాము శాంతియుత వాతావరణం కావాలని, అదే తమ ప్రాధాన్యం అని తెలిపారు. కానీ శాంతి వద్దు.. హింసకు పాల్పడతాం అంటే మీ ఇష్టం అన్నారు.