సర్వస్వం కోల్పోయాను.. స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు తప్ప!: మంత్రి పద్మారావు ఆసక్తికరం
పార్టీ నుంచి బీ ఫారం అందుకున్న పాపాన పోలేదని తెలంగాణ మంత్రి పద్మారావు అన్నారు.
హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఇరవై ఏళ్ల పాటు పని చేసిన తాను ఓ స్వీట్ ప్యాకెట్ అందుకోవడం తప్పా, పార్టీ నుంచి బీ ఫారం అందుకున్న పాపాన పోలేదని తెలంగాణ మంత్రి పద్మారావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంత పని చేసినా ప్రోత్సాహం ఉండదని, ఆ పార్టీలో ఉన్నన్నాళ్లూ తన సర్వస్వం కోల్పోయానని పేర్కొన్నారు. బుధవారం శాసనమండలిలో గుడుంబా నిర్మూలన, పునరావాసంపై చర్చ సందర్భంగా పద్మారావు మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పద్మారావు గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడన్న విషయాన్ని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ పద్మారావు కౌంటర్ ఇచ్చారు.
నాడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో చేరానని, ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికై అసెంబ్లీకి, శాసనమండలికి రాగలిగానని చెప్పారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే గనుక ఉండి ఉంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టేవాడిని కాదేమోనని అన్నారు.