New Ration Card: శుభవార్త చెప్పిన మంత్రి.. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వెళ్తోంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. తాజాగా రూ.500 గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. త్వరలోనే మహిళలకు నెలకు రూ.2500 చెల్లించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు.
ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ రావాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. లక్షల్లో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించడంతో పాటు మీ సేవలో కూడా చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

తాజాగా కొత్త రేషన్ కార్డులపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఏది ఏమైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను కూడా తూచతప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో గత 5 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29 చివరి తేదీగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 75 శాతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 25 శాతం గురువారమే పూర్తి చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకుంటే రేషన్ కార్డులో నుంచి పేరు తీసివేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications