22ఏ భూముల వివాదం పై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
తెలంగాణలో 22ఏ భూముల వ్యవహారం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ప్రయివేటు భూములు సైతం 22ఏ లో చేర్చారనే ఆందోళన కనిపిస్తోంది. దీని పైన ఇప్పటికే రాజకీయంగా ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. హరీష్ నేరుగా రాహుల్ కు లేఖ రాసారు. ఇదే అంశం పైన మంత్రి పొంగులేటి స్పందించారు. కీలక ప్రకటన చేసారు.
22ఏ భూముల వివాదం పైన మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. ఈ విషయం పైన బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టారు. హైదరాబాద్ నగర పరిధిలో 22Aపై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయంటూ మండి పడ్డారు. 22Aపై కొత్త కథలు అల్లి ప్రజలను ఆయా పార్టీలపై మండిపడ్డారు. గతంలో రిలాక్స్ ఇచ్చిన వాటికి క్లియరెన్స్ ఇచ్చామని తెలిపారు. నిజమైన (జెన్యూన్గా) వాటిలో 98 శాతం రిజిస్ట్రేషన్ చేశామన్నారు. చేయలేనివి చేయలేమని తేల్చి చెప్పామని వివరించారు. అయితే టోల్ ఫ్రీ నంబర్ పని చేయడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను మంత్రి పొంగులేటి ఖండించారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఈ టోల్ ఫ్రీ నంబర్కు 1,162 కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. అందులో రిపీటెడ్ కాల్స్ తొలగిస్తే.. 980 వచ్చాయన్నారు. వాటిలో 547 వ్యవసాయానికి అనుబంధమైనవి, 433 వ్యవసాయేతర కాల్స్ అని వివరించారు. రిజిస్ట్రేషన్ కాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పుకొచ్చారు.

ఆందోళన అవసరం లేదు
కాగా, కొందరు దొంగ జీవోలు, మెమోలు తెచ్చి రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి దొంగ జీవోలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యం కాదని మంత్రి పొంగులేటి కుండ బద్దలు కొట్టారు. సిఎస్7, సిఎస్ 14పై దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయని గుర్తు చేశారు. తెర ముందు సామాన్యులను పెట్టి వెనక తమ ఎజెండాను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పలువురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఖరీదైన కార్లు తీసుకుని సిఎస్7, సిఎస్14 భూములు రిజిస్ట్రేషన్ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ విషయాన్ని లేవనెత్తడంతో వివాదంలో పడ్డాయని వివరించారు. ఆ 811 ఎకరాల భూములపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. సర్వే నంబర్ 403లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉంటుందని అన్నారు. ఆ సర్వేలో1,288 ఎకరాలు ఉండగా రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. పొరపాట్లను సరి చేసామని మంత్రి వెల్లడించారు.













Click it and Unblock the Notifications