రోడ్డుపై బైఠాయించిన పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ మేయర్
Ponnam Prabhakar: చారిత్రాత్మక బోనాల పండగ హైదరాబాద్లో రంగరంగ వైభవంగా ఆరంభమైంది. గోల్కొండ బోనాల జాతరతో ఈ నెలన్నర రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టారు. గోల్కొండలో వెలిసిన జగదంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు భక్తులు. అమ్మవారికి తొట్టెలు, ఫలహార బండ్లు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి కార్యక్రమాలతో జంటనగరాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ నెల 14వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. 21వ తేదీన పాతబస్తీ లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదివరకే 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.

తాజాగా బల్కంపేట్లో వెలిసిన ఎల్లమ్మ అమ్మవారికి బోనాలను సమర్పిస్తోన్నారు భక్తులు. ఈ తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద భక్తుల తాకిడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది బారులు తీరారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.
ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తారు. ఎల్లమ్మ అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులు, కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
అధికారులు, ఆలయ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ- తోపులాట మాత్రం తప్పలేదు. అమ్మవారికి కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు ఎగబడ్డారు. ఫలితంగా క్యూలైన్లల్లో స్వల్పంగా తోపులాట సంభవించింది. ఈ ఘటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కిందపడ్డారు.
దీనితో వారు ఆలయం ఎదురుగా రోడ్డు డివైడర్పై బైఠాయించారు. అధికారుల తీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించట్లేదంటూ మండిపడ్డారు. అప్పటికప్పుడు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఫోన్ చేశారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications