Ponnam: త్వరలో ఆ కుటుంబాలకు రూ.25 వేల పింఛన్.. పొన్నం ప్రభాకర్..
తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు. అమరవీరుల కుటుంబాలకు త్వరలోనే రూ.25 పింఛన్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. అలాగే వారికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. శనివారం నల్గొండలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పొన్నం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఇద్దరు మంత్రులు కలిసి నల్గొండ రీజియన్ పరిధిలోని కొత్త బస్సులను ప్రారంభించారు.
తెలంగాణ కోసం ఎంత మంది అమరులయ్యారని పొన్నం తెలిపారు. అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే కేబినెట్ లో చర్చిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. సమాజంలో వెనకబడిన వారిని ముందు తీసుకెళ్లాలనే కులగణనను చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కులగణనకు రూ.150 కోట్లు కేయించినట్లు గుర్తు చేశారు.

గ్రూప్ 1 పరీక్షల్లో బీసీల నుంచి 4,500 మంది ఎంపికయ్యారని వివరించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా 21% డీఏ ఇచ్చామని పొన్నం గుర్తు చేశారు. 280 కోట్ల బకాయిలలో 80 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మరో రూ.200 కోట్లు కూడా జులై చివరిలోగా చెల్లిస్తామని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ ఏసీ బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా హైదరాబాద్ బస్సు నడుపుతామని ప్రకటించారు.
మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రమేశ్ గౌడ్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications