గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు కౌంటర్: మూకుమ్మడిగా మంత్రి తలసాని, గుత్తా, పోచారం దాడి!!
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. మూకుమ్మడిగా దాడికి దిగిన మంత్రి తలసాని, గుత్తా సుఖేందర్ రెడ్డి , పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కూడా తనదైన శైలిలో మండిపడ్డారు. ఫామ్ హౌస్ లు కాదు ఫామ్ లు కావాలి అన్న గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలపై మండిపడిన ఎమ్మెల్సీ కవిత కేవలం కొందరి సంపద పెంపు పైన దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నామని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్లో రాసుకొచ్చారు. కరోనా వంటి క్లిష్ట కాలంలో సెంట్రల్ విస్టా మీద కన్నా దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని కవిత ట్వీట్లో పేర్కొన్నారు.

గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మంత్రి తలసాని
తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆ విధంగా మాట్లాడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డిజిపిని పక్కన పెట్టుకొని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకొని గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గవర్నర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన మండలి చైర్మన్
ఇక మరోవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ గావించారు . అనంతరం వారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత బాధ్యతలో ఉన్న వాళ్ళు తెలంగాణ అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలవుతుందని పేర్కొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు కేంద్రం ఏం చేస్తుందో కూడా చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి కొందరికి కనిపించకుంటే చేసేదేమీ లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కేంద్రం ఏం చేసిందని అడిగితే జాతీయ రహదారుల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కొందరికి కనిపించకపోతే చేసేదేమీ లేదని, వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదని గుత్తా సుఖేందర్ రెడ్డి గవర్నర్ వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా చురకలాంటించారు. ఇక ఇదే సమయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం తనదైన శైలిలో గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

మైకులు దొరకగానే ఆరోపణలు చేయొద్దన్న శాసన సభ స్పీకర్ పోచారం
దేశాన్ని పాలించే వ్యక్తులు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగం కులం, మతాలది కాదని.. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని, మైకులు దొరకగానే ఆరోపణలు చేయొద్దని వ్యాఖ్యానించారు. అంతేకాదు కొంతమంది కళ్ళల్లో సంతోషం కోసం పరిపాలన చేయొద్దని పేర్కొన్న ఆయన ఆ విధంగా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దేశ సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని, పేదలకు పెద్దపీట వేయాలని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా రిపబ్లిక్ డే ప్రసంగంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేశారు.












Click it and Unblock the Notifications