కొమురవెల్లి మల్లన్న స్వరూపమే కేసీఆర్, దేవుడు మన మధ్యనే ఉన్నాడన్న మంత్రి తలసాని!!
కొమురవెల్లి మల్లన్న ప్రతిరూపం కేసీఆర్ అని, దేవుడు మన మధ్య ఉన్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నాయకులపై అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం హద్దు మీరకూడదు. ఏది పడితే అది మాట్లాడేలా మాత్రం ఉండకూడదు. కానీ తెలంగాణా రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల అభిమానం హద్దు దాటుతుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ దేవుడు అని, తెలంగాణ గాంధీ అని మంత్రులు అనేకమార్లు కెసిఆర్ ను ఉన్నతంగా చూపించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొమరవెల్లి మల్లన్న స్వరూపమే కేసీఆర్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కొమురవెల్లి మల్లన్న స్వరూపమే కేసీఆర్ : మంత్రి తలసాని
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని యాదవులు నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొమరవెల్లి ఆలయంలో కొలువుదీరిన మల్లన్న స్వరూపమే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న ప్రతిరూపంగా సీఎం మనకు సేవలు అందిస్తున్నారని సీఎం కేసీఆర్ ను మంత్రి తలసాని కొనియాడారు.

కేసీఆర్ మన మధ్య ఉన్న దేవుడు
కెసిఆర్ పై పొగడ్తలు వర్షం కురిపించిన ఆయన కెసిఆర్ మన మధ్య ఉన్న దేవుడని చెప్పుకొచ్చారు. యాదవుల ఆరాధ్య దైవం కొమరవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి కెసిఆర్ నిధులు కేటాయించారని గుర్తు చేసిన ఆయన, గత ప్రభుత్వాల హయాంలో యాదవులు నిర్లక్ష్యానికి, వివక్షకు గురయ్యారంటూ పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 11 వేల కోట్లతో రాయితీ గొర్రెలను అందించారని పేర్కొన్నారు. యాదవుల సంక్షేమానికి పాటు పడుతున్నారని అన్నారు. అంతేకాదు ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్ వేడుకను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని తెలిపారు.

మాయమాటలు చెప్పేవారిని నమ్మొద్దు: మంత్రి తలసాని సూచన
మాయమాటలు చెప్పే వారికి కాకుండా ప్రజలు చేతల ప్రభుత్వానికి మద్దతు తెలపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కరీంనగర్ లోక్సభకు వినోద్ కుమార్ వంటి నాయకుడిని గెలిపించుకుంటే, అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇక ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాలరాజు యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇక మంత్రి తాజాగా కొమరవెల్లి మల్లన్న తో సీఎం కేసీఆర్ ను పోల్చి చెప్పడం వివాదాస్పదంగా మారింది.












Click it and Unblock the Notifications